Tenali: జస్టిస్ జ్యోతిర్మయికి మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారం
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:53 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపకు మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని శనివారం తెనాలిలో ప్రదానం చేశారు.
తెనాలి అర్బన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపకు మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని శనివారం తెనాలిలో ప్రదానం చేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు మొవ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం నిర్వహించారు. ఏటా ఆమె పేరిట ఒక ప్రముఖునికి పురస్కారాన్ని అందించడంతో పాటు సేవా కార్యక్రమాన్ని సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పదవ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5 వేలు వంతున జస్టిస్ జ్యోతిర్మయి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విద్యార్థులు-భవిష్యత్ సవాలు అనే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఏ పరిస్థితుల్లోనైనా ఆత్మ విశ్వాసం, మనోబలంతో విద్యార్థులు ముందుకు వెళ్లి విజయం అందుకోవాలన్నారు. యుక్త వయసులో ఎదురయ్యే ఆకర్షణలకు లోను కాకుండా వ్యక్తిత్వంతో ముందుకు సాగితేనే ఉన్నత స్థానం చేరుకుంటారని చెప్పారు. కాకినాడ జేఎన్టీయూ ఉపకులపతి చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు 80 శాతం పైగా ఉన్నత చదువులకు వెళుతున్నారని, మన దేశంలో 30 శాతం దాటడం లేదన్నారు. ప్రతి విద్యార్థి డిగ్రీ వరకు విద్యను అభ్యసిస్తేనే వికసిత భారత్గా మారి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంటామని తెలిపారు.