Pawan Kalyans Leadership: ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:22 AM
రాష్ట్రవ్యాప్తంగా జల్జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం....
పక్కా ప్రణాళికలతో జల్ జీవన్ మిషన్ పనులు.. ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందికి మొట్టమొదటిసారిగా శిక్షణ
డిప్యూటీ సీఎం పవన్ చొరవతో గడువు పొడిగించిన కేంద్రం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా జల్జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముం దుకెళ్తోంది. ఈ పనుల వేగవంతానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. సిబ్బంది సామర్థ్యాల పెంపు, నీటి నాణ్యత, శుద్ధి, సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం సిబ్బందిలో అంతర్గత సామర్థ్యాలు పెంచేలా క్షేత్రస్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్రస్థాయిలోని ఉన్నత ఇంజనీర్ వరకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం జల్జీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బతీస్తే...పవన్కల్యాణ్ కృషి, ప్రణాళిక జల్జీవన్ మిషన్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గత ప్రభుత్వ ధోరణి కారణంగా నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తగా...సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యర్థనలతో కేంద్రం జల్జీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువును నాలుగేళ్లపాటు పొడిగించింది. ఈ ఏడాది ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లతో పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి తీరుతుంది. దీంతో రానున్న 30 ఏళ్ల కాలానికి, 1.21 కోట్ల మందికి రక్షిత తాగునీరు ఇవ్వాలన్న సంకల్పం నెరవేర నుంది.
ప్రకాశం జిల్లాలో అతి పెద్ద ప్రాజెక్టు..
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా జల్జీవన్ మిషన్ పథకం కింద జూలై 4వ తేదీ రూ. 1,290 కోట్లతో మెగా ప్రాజెక్టుకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు ఈ ప్రాజెక్టుతో తీరుతాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఇంత పెద్ద తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించలేదు. అలాగే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ తాగునీటి సరఫరా మెగా ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టును పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మొట్టమొదటసారిగా సిబ్బందికి నీటి భద్రత, నాణ్యత పెంపు, సుస్థిర నిర్వహణ, వ్యర్థ జలాల పునర్వినియోగం, క్షేత్రస్థాయి పరిశీలన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఎస్ఈ, ఈఈ స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయిలో డిప్యూటీ ఎంపీడీఓలు, ఏఈ స్థాయి వరకు సుమారు 1400 మందికి శిక్షణ పూర్తి చేశా రు. గ్రామస్థాయి సిబ్బందికి నవంబరు, డిసెంబరుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీటి సరఫరాకు సాంకేతిక వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రోజుకు ప్రతివ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రధాని సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు, పవన్కల్యాణ్ జల్జీవన్ మిషన్ పనులను ముందుకు తీసుకెళ్తున్నారు.