Political Criticism: అంతా అయిపోయాక.. జగన్ రాక
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:17 AM
బెంగళూరు విడిది నాయకుడిగా ముద్రపడ్డ వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఈ విమర్శల ధాటితో ఎట్టకేలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంగళవారం బయటకు రానున్నారు.
నేడు కృష్ణాలో మాజీ సీఎం పర్యటన
‘విడిది నేత’ విమర్శల హోరుతో కదిలిన వైసీపీ నేత
అమరావతి/మచిలీపట్నం టౌన్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘బెంగళూరు విడిది నాయకుడి’గా ముద్రపడ్డ వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఈ విమర్శల ధాటితో ఎట్టకేలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంగళవారం బయటకు రానున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి తొలుత పెనమలూరులోను, తర్వాత పెడన నియోజకవర్గంలోని గూడూరులోను పంటలను పరిశీలిస్తారు. కాగా, మొంథా తుఫాను రాష్ట్రం తలుపు తట్టకముందే బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్.. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గాక తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయనను విడిది నాయకుడంటూ పలు పార్టీల నాయకులు విమర్శించారు. ఇక, ‘‘మొంథా చంద్రబాబు సృష్టించిన విపత్తు.’’ అని జగన్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, జగన్ వ్యాఖ్యలు వైసీపీకి తీవ్రనష్టం చేకూర్చాయని ఆ పార్టీ నేతలు అంతర్గత భేటీల్లో చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కృష్ణా జిల్లాలో రైతులను పరామర్శించేందుకు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.