Minister Dola: దివ్యాంగుల పింఛన్లపై జగన్ విష ప్రచారం
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:16 AM
జగన్ అండ్ కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు.
అర్హతగల ప్రతి ఒక్కరికీ పింఛను ఇస్తున్నాం: మంత్రి డోలా
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జగన్ అండ్ కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. పింఛన్ల పెంపుపై నాడు మాట తప్పి దివ్యాంగులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్రెడ్డి అని విమర్శించారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందని జగన్ అండ్ కో బ్లూ మీడియా ద్వారా విష ప్రచారం చేయడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పింఛనూ తొలగించలేదు. సదరం సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జరుగుతోంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛను ఇస్తున్నాం. దివ్యాంగుల పింఛన్ రూ.3వేల నుంచి రూ.6 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదే. పింఛన్ల కోసం జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం రూ.18 నెలల్లోనే రూ.50వేల కోట్లు ఖర్చు చేసింది. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు 7 వరాలు ప్రకటించడంతో వారంతా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. అది చూసి ఓర్వలేకనే జగన్ అండ్ కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి మండిపడ్డారు.