International Experts: పోలవరంలో విదేశీ నిపుణులు
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:01 AM
పోలవరం హెడ్వర్క్స్లో కీలకమైన డయాఫ్రం వా ల్, ఎర్త్ కమ్ రాక్ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యాం గ్యాప్-1, గ్యాప్-2 నిర్మాణ పనులను పరిశీలించేందుకు అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు.
డయాఫ్రం, బట్రస్ డ్యాం పనుల పరిశీలన
అమరావతి/పోలవరం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పోలవరం హెడ్వర్క్స్లో కీలకమైన డయాఫ్రం వా ల్, ఎర్త్ కమ్ రాక్ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యాం గ్యాప్-1, గ్యాప్-2 నిర్మాణ పనులను పరిశీలించేందుకు అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. అమెరికాకు చెందిన జియాస్ ప్రాన్కో డి సిస్కో, డేవిడ్ బి.పాల్, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ.. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సిం ఘాల్, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఎస్ఎస్ బక్షి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సభ్యకార్యదర్శి రఘురాం, జలసంఘం డైరెక్టర్ రాజేశ్ తొటేజా, సెంట్రల్ సాయిల్ -మెటీరియ ల్ రీసెర్చ్ సెంటర్(సీఎస్ఎంఆర్ఎస్) శాస్త్రవేత్త మనీశ్ గుప్తా తదితరులు మొదటి రోజు ఆయా నిర్మాణాలను పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద సీపేజీ నివారణ కోసం నిర్మించిన బట్రస్ డ్యాం, జరుగుతున్న డయాఫ్రం వాల్ పనులు, ఈసీఆర్ఎఫ్ డ్యాం వద్ద గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులు, దిగువ కాఫర్ డ్యాంలో సీపేజీ తీవ్రత, డీవాటరింగ్, ల్యాబ్లలో మెటీరియల్ నాణ్యతను పరిశీలించారు. వారి వెంట ఎంబ్యాక్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గౌరవ్ తివారీ, ఎంబ్యాంక్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు హేమంత్ గౌతమ్, అశ్విన్ కుమార్ వర్మ, సీఎస్ఎంఆర్ఎస్ శాస్త్రవేత్తలు రవి అగర్వాల్, సెంట్రల్ వాటర్-పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్సీ) వి.ఎస్ .రామారావు, పీపీఏ డిప్యూ టీ డైరెక్టర్ ఎ.ప్రవీణ్, అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ సంజీవ్, జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. పనులన్నీ డిజైన్ల మేరకు, నాణ్యతా ప్రమాణాల ప్రకారమే జరుగుతున్నాయో లేదో సమీక్షించారు. గతంలో నిపుణులు చేసిన సూచనల మేరకే చేపడుతున్న పనుల గురించి జల వనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి బృందం వివరించింది.