Mithun Reddy: వివాదాల పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉంది
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:03 AM
ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగించారు.
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం శనివారం పోస్ట్ చేసింది. అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పనితీరు నివేదికపై ఆయన మాట్లాడుతూ... పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందనే విషయాన్ని భారతదేశం విశ్వసిస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశమని, ఐక్యరాజ్యసమితి విధివిధానాలకు తమ దేశం కట్టుబడి ఉందన్నారు. వర్తకం, పెట్టుబడుల్లో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్యసమితి విధానాలకు అనుగుణంగా భారత్ పనిచేస్తోందన్నారు. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ విధానాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చన్నారు.