Krishna district: మడ తేశారు
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:54 AM
సముద్రతీర ప్రాంతాలకు రక్షణ కల్పించే ఎంతో విలువైన మడ చె ట్లు రెవెన్యూ అధికారుల నిర్వాకంతో కనుమరుగైపోతున్నాయి. కృష్ణాజిల్లా పెడన జింజేరులో లజ్జబండ కాల్వ వెంబడి ఆక్వా సాగు కోసం అక్రమార్కులు...
పీడబ్ల్యూడీ భూముల్లోని మడచెట్లు కొట్టి అడ్డగోలుగా రొయ్యల చెరువుల తవ్వకం
కృష్ణాలో అక్రమార్కులకు రెవెన్యూ అండ
200 ఎకరాల ఆక్రమణ.. పట్టాలు.. రిజిస్ర్టేషన్
మౌనంగా అటవీ, సాగునీటి శాఖలు
రొయ్యల చెరువులతో పొలాలు నాశనం
ఆందోళనలో పట్టాభూముల రైతులు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
సముద్రతీర ప్రాంతాలకు రక్షణ కల్పించే ఎంతో విలువైన మడ చె ట్లు రెవెన్యూ అధికారుల నిర్వాకంతో కనుమరుగైపోతున్నాయి. కృష్ణాజిల్లా పెడన జింజేరులో లజ్జబండ కాల్వ వెంబడి ఆక్వా సాగు కోసం అక్రమార్కులు విచ్చలవిడిగా మడ చెట్లను నరికేస్తున్నారు. పీడబ్ల్యూడీ భూములుగా ఉన్న వాటికి కూడా పట్టాలు ఇచ్చి, రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కిస్తూ పెడన రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా ఈ అక్రమాలకు సహకరిస్తున్నారు. మడచెడ్లను యథేచ్ఛగా నరికేస్తుండటంతో సముద్రపు ఆటుపోట్ల కారణంగా ఎగదన్నే ఉప్పునీటితో పంట పొలాలు చౌడుబారిపోతున్నాయి. మడ చెట్లు కొట్టేస్తుంటే అటవీశాఖ, పీడబ్ల్యూడీ భూములను కొల్లగొడుతుంటే ఇరిగేషన్ శాఖ ఏం చేస్తున్నాయనేది పెద్ద ప్రశ్న! వివరాల్లోకి వెళితే...పెడన మండలంలో సముద్రతీరప్రాంతమైన జింజేరు మీదుగా లజ్జబండ డ్రెయిన్ ప్రవహిస్తోంది. డ్రెయిన్ ఎగువన గుడివాడ నుంచి వచ్చి, జింజేరు దిగువన పెదపట్నం దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ డ్రెయిన్కు రెండు వైపులా ఒక్క జింజేరు (2) ప్రాంతంలోనే 200 ఎకరాల పీడబ్ల్యూడీ భూములున్నాయి. ఈ భూముల్లో ఇప్పటి వరకు 125 ఎకరాలను అక్రమార్కులు ఆక్రమించుకుని ఆక్వా సాగు చేస్తున్నారు. తాజాగా మిగిలిన 75 ఎకరాల పీడబ్ల్యూడీ భూముల పరిధిలో కూడా లజ్జబండ డ్రెయిన్కు రెండు వైపులా మడచెట్లను నరికి భూములను ఆక్రమిస్తున్నారు. ఇలా ఆక్రమించిన భూములలో యుద్ధ ప్రాతిపదికన ప్రొక్లయినర్లను తెప్పించి రాత్రికి రాత్రే చెరువులు తవ్విస్తున్నారు.
కృష్ణాజిల్లా అచ్చయ్యవారి పాలెం గ్రామం పరిఽధిలోని జింజేరు (2)లో సర్వే నంబర్ 16/1, 21/1, 21/2, 21/3, 23/3 లలో అడ్డగోలుగా మడచెట్లను నరికి చేపల చెరువులు తవ్వారు. తమ భూముల వెంబడి ఆయా సర్వే నంబర్ల పరిధిలో జరుగుతున్న మడచెట్ల నరికివేత, అక్రమ చెరువుల తవ్వకంపై స్థానిక రైతులు రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. స్థానిక రెవెన్యూ అధికారి దృష్టికి ఎన్ని సార్లు తీసుకు వెళ్ళినా పట్టించుకోవటం లేదని, అక్రమ తవ్వకాలన్నీ మండల రెవెన్యూ అధికారుల కనుసన్నలలో జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. రొయ్యల చెరువులను ఏర్పాటు చేసుకోవటానికి పంట చేల నుంచి మురుగుపోయే కాల్వలు కూడా పూడ్చేస్తున్నారు. సాగు నీటి కాలువలను కూడా పూడ్చివేస్తున్నారు. దీంతో రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
పట్టాలెలా ఇస్తారు ?
పీడబ్ల్యూడీ భూములనేవి నిషేధిత భూములు. వీటికి కూడా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టాలు ఇస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సర్వే నెంబర్ 21/1 , 21/2 లలో పీడబ్ల్యూడీ భూములను ఆక్రమించుకున్న వారి పేర్లను అడంగల్ 1బీలో పేర్లను నమోదు చేశారు. ఇది ముమ్మాటికీ తప్పు. కానీ ఈ పని రెవెన్యూ అధికారులు ఇంత ధైర్యంగా ఎలా చేశారన్నది తేలాల్సి ఉంది. పీడబ్ల్యూడీ భూములలో రొయ్యల సాగు చేస్తున్న వారిలో కొందరు ఆ భూములను విక్రయిస్తున్నారు కూడా. అడంగల్ 1బీలో అధికారులు నమోదుచేసిన పేర్లను అడ్డం పెట్టుకుని అక్రమంగా రిజిస్ర్టేషన్లు చేయించుకుంటున్నారు. అత్యంత విలువైన మడచెట్లను దారుణంగా నరికివేస్తుంటే అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. లజ్జబండ డ్రెయిన్ వెంబడి ఉన్న పీడబ్ల్యూడీ భూములను ఆక్రమిస్తుంటే ఇరిగేషన్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.