తాత్సారం!
ABN , Publish Date - May 18 , 2025 | 01:35 AM
ముఖ్యమంత్రి నిధులిచ్చినా అధికారుల అలసత్వం ఎత్తిపోతల పథకాలకు శాపంగా మారింది. వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి గురై పూర్తిగా మూలనపడిన వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు సీఎం చంద్రబాబు రూ.15 కోట్లు ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి రానున్న ఖరీఫ్ సీజన్కు నీరందించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను అమలు చేయడంలో ఐడీసీ అధికారులు ఒకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిధులు సిద్ధంగా ఉన్నా అంచనాలు, రిమార్కులు అంటూ ఫైల్ను అక్కడికి ఇక్కడికి తిప్పుతూ తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే ఖరీఫ్కు నీరందడం అనుమానమేనని రైతులు పేర్కొంటున్నారు.
- వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతుల్లో అధికారుల నిర్వాకం
- మరమ్మతులకు రూ.15 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు
- అంచనాల రూపకల్పనలో అంతులేని జాప్యం చేస్తున్న అధికారులు
- ఖరీఫ్కు నీరు అందదేమోనని రైతుల్లో ఆందోళన
ముఖ్యమంత్రి నిధులిచ్చినా అధికారుల అలసత్వం ఎత్తిపోతల పథకాలకు శాపంగా మారింది. వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి గురై పూర్తిగా మూలనపడిన వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు సీఎం చంద్రబాబు రూ.15 కోట్లు ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి రానున్న ఖరీఫ్ సీజన్కు నీరందించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను అమలు చేయడంలో ఐడీసీ అధికారులు ఒకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిధులు సిద్ధంగా ఉన్నా అంచనాలు, రిమార్కులు అంటూ ఫైల్ను అక్కడికి ఇక్కడికి తిప్పుతూ తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే ఖరీఫ్కు నీరందడం అనుమానమేనని రైతులు పేర్కొంటున్నారు.
(ఆంధ్రజ్యోతి, నందిగామ):
రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నిర్మాణంగా వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాలను చెప్పవచ్చు. కృష్ణానదిపై వేదాద్రి వద్ద అత్యంత లోతైన ప్రదేశం వద్ద ఈ పథకం నిర్మించారు. నది నుంచి ఇరవై మీటర్ల ఎత్తులో మోటార్లు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి 110 మీటర్ల ఎత్తు ఉన్న కొండపైకి పైప్లైన్ ద్వారా నీటిని తోడి పోస్తారు. అక్కడ నుంచి 4.5 కిలో మీటర్లమే గ్రావెటీతో ప్రయాణించిన నీరు ఎన్ఎస్పీ కాలువలో కలుస్తుంది. రెండు దశాబ్దాల క్రితం అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొండల మధ్య ఈ పథకాన్ని నిర్మించి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అదే పంప్ హౌస్, పైప్లైన్లు ఆసరా చేసుకొని కాంగ్రెస్ పభుత్వం మరో పథకాన్ని అక్కడే నిర్మించింది. వేదాద్రి- కంచల పథకాల నిర్మాణం అనేది ఆనాటి పరిస్థితులకు అంత తేలికగా చెప్పే అంశం కాదు. ఆయా పథకాల కింద 17 వేల ఎకరాల భూమికి సంవృద్ధిగా నీరు అందుతోంది. కావల్సినంత నీటి సరఫరా ఉండడంతో అన్నదాతలు నాణ్యమైన పంటలు పండించారు. ఆర్థికంగా ఎదిగారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం ఆ పథకాలకు పూర్తి మరమ్మతులు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించింది.
వైసీపీ రాకతో మూలనపడ్డ మోటార్లు
ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను నిర్లక్ష్యం చేసింది. ఈ పథకాల విలువ తెలియని పాలకవర్గం ఉన్న నిధులు కాజేసి పథకాన్ని నిర్వీర్యం చేసింది. నాలుగు మోటార్లు మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. ఫలితంగా ఐదేళ్లుగా ఆయకట్టుకు చుక్క నీరందించని స్థితి నెలకొంది. ఈ తరుణంలో ఏప్రిల్ 5న నియోజకవర్గంలోని ముప్పాళ్ల వచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్, పార్టీ ముఖ్యనాయకులు ఈ పథకం గురించి వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు పథకం మరమ్మతులకు రూ.15 కోట్లు కేటాయిస్తూ ప్రకటన చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఖరీఫ్ నాటికి నీరందించాలని సూచించారు.
అధికారుల పనితీరుపై విమర్శలు
స్వయంగా ముఖ్యమంత్రి నిధులు కేటాయించినా పనులు చేపడ్డంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తొలుత ఈ పథకం మరమ్మతులకు రూ.12.5 కోట్లతో అంచనాలు రూపొందించారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత రీఎస్టిమేట్ వేసిన అధికారులు రూ.14.5 కోట్లకు అంచనాలు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ జరపడానికే అధికారులు నెల రోజుల సమయం తీసుకున్నారు. రూపొందించిన అంచనాలు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడం, ఆ అంచనాలపై రిమార్కులు సూచిస్తూ ఉన్నతాధికారులు స్థానిక అధికారులను వివరణ కోరడం జరిగింది. ఉన్నతాధికారుల రిమార్కులపై ఇంత వరకూ స్థానిక అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ పూర్తయి మోటార్లకు ఆర్డర్ ఇవ్వాలంటే ఇంకా నెలరోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నిధులు ఇస్తున్నా పని చేయడడంలో అధికారులు జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా నీరందవేమో అంటూ ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయం అవసరం
వేదాద్రి- కంచల ఆయకట్టుకు పథకం నుంచి సకాలంలో నీరు అందించడం ప్రశ్నార్థకమైన వేళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఐడీసీ అధికారులు ఇక నుంచి వేగంగా పనులు చేపట్టినా సెప్టెంబరు మాసం వరకూ మోటార్ల ఏర్పాటు ప్రక్రియ పడుతుంది. ఈలోగా సాగు అవసరాలకు నీరు అందించే ప్రణాళికను ఎన్ఎస్పీ అధికారులు చేపట్టాల్సి ఉంది. గౌరవరం బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న ఈ పఽథకం ఆయకట్టుకు చెరువు మాధవరం ట్యాంక్ నుంచి నీటిని అందించాల్సి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ట్యాంక్ నుంచి నిబంధనల ప్రకారం ఆగస్టు 20 తర్వాతే నీరు విడుదలవుతుంది. అప్పటి వరకూ నీటి అవసరాలు తీర్చేందుకు గాను తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయించాల్సి ఉంది. లేని పక్షంలో ఈ ఏడాది కూడా ఆయకట్టు రైతులకు సాగునీటి కషాలు తప్పేలాలేవు.