Road Accident: మిత్రబృందంపై మృత్యుపంజా
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:20 AM
ఐదునెలల క్రితం పెళ్లి చేసుకున్న మిత్రుడు కెనడా నుంచి వస్తున్నాడని... తీసుకువచ్చేందుకు మిత్రబృందం విమానాశ్రయానికి వెళ్లింది. వారిలో ఈనెల 31న పెళ్లి కావలసిన యువకుడు కూడా ఉన్నాడు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం.. కారును ఢీకొన్న పలు వాహనాలు
మృతుల్లో ఇటీవలే పెళ్లైన, 31న పెళ్లి కావాల్సిన ఇద్దరు యువకులు
కర్ణాటకలోని హోసూరు సమీపంలో ఘటన
హోసూరు(క్రైం), అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఐదునెలల క్రితం పెళ్లి చేసుకున్న మిత్రుడు కెనడా నుంచి వస్తున్నాడని... తీసుకువచ్చేందుకు మిత్రబృందం విమానాశ్రయానికి వెళ్లింది. వారిలో ఈనెల 31న పెళ్లి కావలసిన యువకుడు కూడా ఉన్నాడు. అంతా ఆనందంగా తిరిగి వస్తుండగా రోడ్డుప్రమాద రూపంలో మృత్యువు వారిని కాటేసింది. వీరు ప్రయాణిస్తున్న కారును ఒక లారీతో పాటు పలు వాహనాలు ఢీకొనడంతో నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం హోసూరు సమీపంలోని గోపసంద్రం వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన మదన్కుమార్ (27) ఐటీ ఉద్యోగి. ఇతడికి ఐదు నెలలక్రితం వివాహమైంది. దీపావళి సెలవుల కోసం కెనడా నుంచి వచ్చాడు. అతడిని తీసుకొచ్చేందుకు తమిళనాడులోని సేలం ప్రాంతం ఓమలూరుకు చెందిన ముగిలన్ (30), బెంగళూరులోని చిక్కనాగమంగల ప్రాంతానికి చెందిన మణివణ్ణన్ (27), గోకుల్ (28) వెళ్లారు. అంతా కలిసి కారులో ఈ రోడ్వైపు బయల్దేరారు. గోపసంద్రం వద్ద వ్యాన్ అడ్డు రాడంతో కారు సడన్ బ్రేక్ వేసి ఆపారు. ఆ సమయంలో వెనకే వేగంగా వస్తున్న లారీ వీరి కారును ఢీకొంది. వెనుక వచ్చిన మరో 3, 4 వాహనాలు కూడా ఢీకొన్నాయి. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులోని నలుగురు యువకులు చనిపోయా రు. ప్రమాద సమయంలో కారును మణివణ్ణన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇతడు యూపీఎస్సీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచిచూస్తుండేవాడు. ఈనెల 31న పెళ్లి జరగాల్సి ఉంది. ముగిలన్, గోకుల్ కూడా టెకీలే.