MP Krishna prasad: హిందూ ధర్మం విశ్వవ్యాప్తం కావాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:55 AM
హిందూ ధర్మం విశ్వవ్యాప్తం కావాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. టీటీడీ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులను అర్చక స్వాములుగా తీర్చిదిద్ది...
సమరసత సేవా ఫౌండేషన్ సేవలు స్ఫూర్తినిచ్చాయి
ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార అర్చక స్వాముల ఆత్మీయ సమ్మేళనంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్
విజయవాడ సిటీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మం విశ్వవ్యాప్తం కావాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. టీటీడీ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులను అర్చక స్వాములుగా తీర్చిదిద్ది, గ్రామాల్లో హిందూ ధర్మాన్ని కాపాడుతున్న సమరసత సేవా ఫౌండేషన్ (ఎస్ఎస్ఎఫ్) సేవలను అభినందించారు. హిందు ధర్మ పరిరక్షణకు ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార అర్చక స్వాముల ఆత్మీయ సమ్మేళనం శనివారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో ఎస్ఎస్ఎఫ్ నిర్మించిన దేవాలయాలను సందర్శించి ఆశ్చర్యపోయానన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనే పట్టుదల ఇంకా ఆయా పల్లెల్లో ఎంతో మందిలో ఉందనే విషయాన్ని గ్రహించానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్ఎస్ఎఫ్ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎస్ఎస్ఎఫ్ అధ్యక్షులు తాళ్లూరు విష్ణువు మాట్లాడుతూ ఇప్పటి వరకు 800లకు పైగా ఎస్సీ, ఎస్టీ, మత్య్సకారుల పల్లెల్లో దేవాలయాలను నిర్మాణం చేశామన్నారు. వీటికి అనుసంధానంగా 301 బాలవికాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల చిన్నారులకు అర్చకత్వంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి, విరజానంద స్వామి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ధర్మ జాగరణ విభాగం ప్రతినిధి అమర లింగన్న, ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ భరత్, ఎస్ఎస్ఎఫ్ జాతీయ కన్వీనర్ శ్యాంప్రసాద్, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఆదిత్య పాల్గొన్నారు.