AP High Court: పీఎస్ఆర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:56 AM
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్సైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్కు హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డ కేసులో వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
ప్రాథమిక దశలోనే కేసు దర్యాప్తు
నేర స్వభావం కూడా తీవ్రంగా ఉంది
మెడికల్ బెయిల్ కోసం విజయవాడ కోర్టును ఆశ్రయించవచ్చు: హైకోర్టు
ఏ2 మధుసూదన్కు కూడా చుక్కెదురు
ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో కోర్టు తీర్పు
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్సైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్కు హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డ కేసులో వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ మంజూరు సమయంలో నిందితులపై ఉన్న ఆరోపణల తీవ్రత, నేరం రుజువైతే ఎంత శిక్ష పడుతుంది? సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందా? తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, అలాగే పిటిషనర్లపై ఉన్న నేర స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు న్యాయ స్ధానం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో ఆక్రమాలకు పాల్పడడంతోపాటు నిధుల దుర్వినియోగం చేశారని పేర్కొంటూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(ఏ1), మధుసూదన్(ఏ2) ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సాయి రోహిత్ వాదనలు వినిపించారు.
తీర్పు ఇదీ..
‘‘హాయ్ల్యాండ్ రిసార్ట్స్లో మ్యాన్యువల్ మూల్యాంకనం చేయించేందుకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో పీఎస్ఆర్ ఆంజనేయులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం క్యామ్సైన్ సంస్థకు రూ.1.14 కోట్లు చెల్లించారనే ఆరోపణపై దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ మంజూరు చేయాలని పీఎస్ఆర్ తరఫు న్యాయవాది కోరుతున్నారు. రికార్డులను పరిశీలించగా.. తమ పర్యవేక్షణలో ఉండాలని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పీఎ్సఆర్ను కోరారు. దీనికి ఆయన నిరాకరిస్తూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు వారాల మెడికల్ బెయిల్ కోరుతూ విజయవాడ మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసుకొనేందుకు పీఎ్సఆర్కు స్వేచ్ఛను ఇస్తున్నాం.’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. మెడికల్ బెయల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన అనంతరం విజయవాడ జీజీహెచ్ నుంచి ఆరోగ్య పరిస్థితిపై తాజా నివేదిక తెప్పించుకోవాలని విజయవాడ కోర్టును ఆదేశించారు. అదేవిధంగా రెండు వారాల్లోగా వ్యాజ్యాన్ని పరిష్కరించాలన్నారు.