AP High Court: శాశ్వత బోధన సిబ్బందిని నియమించకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:57 AM
సర్వశిక్ష అభియాన్ పథకం కింద నడిచే విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించకుండా అందులో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు...
కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం దక్కడంలేదు
కేజీబీవీల్లో శాశ్వత నియామకాలపై మా వైఖరి చెప్పండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం.. విచారణ 15కు వాయిదా
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సర్వశిక్ష అభియాన్ పథకం కింద నడిచే విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించకుండా అందులో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. అణగారిన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం, వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీల)ను ఏర్పాటు చేసి, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ప్రయోజనం దక్కడంలేదంది. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించే వ్యవహారంపై వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.