AP High Court: ఆ ఖాళీలు ఎప్పటిలోగా భర్తీ చేస్తారు
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:34 AM
లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్ఆర్సీ), ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ), రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీఆర్డీసీ)లో...
లోకాయుక్త, హెచ్ఆర్సీ, ఈఆర్సీ, ఎస్సీఆర్డీసీలో పోస్టుల ఖాళీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్ఆర్సీ), ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ), రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీఆర్డీసీ)లో చైర్మన్/చైర్పర్సన్, సభ్యుల పోస్టులను ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ ఖాళీలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో స్పష్టతనిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలతో ప్రస్తుత పిల్ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా సంస్థల్లో సభ్యుల పోస్టులను భర్తీచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విల్లూరి వెంకట రమణమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. పోస్టులు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.