Share News

AP High Court: పిన్నెల్లి సోదరులపై తొందరపాటు చర్యలు వద్దు

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:33 AM

టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసు విషయంలో నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై పది రోజులపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

AP High Court: పిన్నెల్లి సోదరులపై తొందరపాటు చర్యలు వద్దు

  • టీడీపీ నేతల హత్యల కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసు విషయంలో నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై పది రోజులపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. పల్నాడుజిల్లా, వెల్దుర్తి మండలం, గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు హత్యకు గురయ్యారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా ఫిర్యాదుదారుడి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. వ్యాజ్యంలో ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతించాలని, తమ వాదనలు కూడా వినాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్ట్‌ నుండి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 06:35 AM