Minister Satya kumar: ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:31 AM
ఆరోగ్యాంధ్రపదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రత్యేకంగా...
ఆ దిశగా సీఎం, డిప్యూటీ సీఎం కృషి
పోలియో సమూల నిర్మూలనే ధ్యేయం: సత్యకుమార్
కాకినాడ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యాంధ్రపదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించడమే ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24 తేదీల్లో సంచార జాతులు నివసించే ప్రాంతాలు, నిర్మాణ స్థలాలు, ఇటుక బట్టీలు, ఇతర వలస ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేసేందుకు 1,854 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అరాచక శక్తులు, వినాశనం కోరుకున్న వారు, విధ్వంసం సృష్టించిన వారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మంత్రి సత్యకుమార్ ఈ సందర్భంగా సమర్ధించారు. ఆయన చెప్పినట్టు ఏపీలో కొందరికి ఆ ట్రీట్మెంట్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ‘ఓ వ్యక్తికి కేన్సర్ వస్తే.. ఆ గడ్డను కోసి పారేస్తే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.. అలాగే రాష్ట్రంలో పేట్రేగిపోతున్న అరాచక శక్తులను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంధకారమైందని, పిల్లల భవిష్యత్తు నాశనమైందని విమర్శించారు. వైద్య విద్యకు సంబంధించి పీపీపీ విధానాన్ని అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని, నీతి ఆయోగ్ ఈ పాలసీని రూపొందించిందని, దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల కొంతమంది ఈ విషయమై హైకోర్టుకు వెళ్లగా కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిందన్నారు. వైసీపీ హయాంలో డబ్బులు ఖర్చుపెట్టకుండా వాటిని దారిమళ్లించి, నేడు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాలేజీలు నిర్మించకుండా నిధులు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఎంతో అనుభవం ఉన్నవారిని ఈ పీపీపీ విధానంలో భాగస్వాములుగా చేస్తున్నామని తెలిపారు.