Andhra Pradesh High Court: సమయం ఇవ్వాలంటే 10 వేలు కట్టండి!
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:51 AM
ఎమ్మెల్సీ పదవికి సమర్పించిన రాజీనామాపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం వెల్లడించడం లేదని, సత్వరమే నిర్ణయం వెల్లడించేలా ఆదేశాలు..
శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ పదవికి సమర్పించిన రాజీనామాపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం వెల్లడించడం లేదని, సత్వరమే నిర్ణయం వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. కౌంటర్ వేసేందుకు మరింత సమయం ఇవ్వాలని చైర్మన్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. సమయం ఇవ్వాలంటే కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి న్యాయవాది అంగీకరించడంతో రూ.10 వేలను బుధవారం సాయంత్రం 5 గంటలలోగా హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్ద జమ చేయాలని కోర్టు పేర్కొంది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.