AP CM Chandrababu: జీఎస్టీ ఫలాలు ఇంటింటికీ చేరాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:37 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరాలని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను కోరారు.
నేటినుంచి 19వరకు రాష్ట్రమంతా విస్తృత ప్రచారం
అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరాలని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను కోరారు. ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలందరికీ తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులోభాగంగా ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలు, వినియోగదారుల్లోకి తీసుకెళ్లేలా విస్తృతప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65 వేల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 19వరకు వేర్వేరు థీమ్లతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇదీ షెడ్యూల్.. మంగళవారం నుంచి అక్టోబరు 19 వరకు జీఎస్టీ సంస్కరణలపై అవగాహన, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయం, ఎంఎ్సఎంఈలు, చేనేత ఉత్పత్తులు, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలకా్ట్రనిక్స్, ఈ కామర్స్, భవన నిర్మాణరంగం, టూరిజం, ఆతిథ్యరంగం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమొబైల్స్ తదితర అంశాలపై రంగాలవారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు. రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలని కోరారు. ఆప్కో, లేపాక్షి, ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పేరిట మేళాలు, ఎంఎ్సఎంఈ ఉత్పత్తులు, దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించేలా చూడాలన్నారు. సెలూన్లు, యోగా సెంటర్లు, జిమ్లలో జీఎస్టీ తగ్గింపు వల్ల ధరల్లో ఎంత వ్యత్యాసం వచ్చిందో అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు.
విద్యార్థుల్లోనూ అవగాహన పెంచేలా..
జీఎస్ట్టీ తగ్గింపుతో స్టేషనరీ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వీటిపై అవగాహన కల్పించేలా విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని ఏడువేల ఉన్నత పాఠశాలలు, నాలుగు వేల జూనియర్ కాలేజీల్లో ఈ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జీవిత బీమా, ఆరోగ్యబీమాకు సంబంధించి జీరో జీఎస్టీ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. ఎలకా్ట్రనిక్ వస్తువులకు సంబంధించిన ధరలపై అవగాహన కల్పించేందుకు ఉత్పత్తిదారులు,డీలర్లతో 850కిపైగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, అధికారులు పాల్గొన్నారు.
పశువుల మందులు చౌక
జీఎస్టీ 2.0తో పశువుల మందుల ధరలు తగ్గాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టీ దామోదర్నాయుడు తెలిపారు. పశువైద్యానికి వాడే అన్ని డయాగ్నోస్టిక్ కిట్లతో సహా 10 రకాల వెటర్నరీ మెడికల్ ప్రొడక్ట్స్పై జీఎస్టీ 5 శాతం నుంచి జీరోకు వచ్చినట్లు చెప్పారు. అన్ని రకాల యాంటీబయోటిక్స్, డీవార్మింగ్ మందులపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందన్నారు.