Share News

Hydrogen Summit: అమరావతిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:54 AM

అమరావతి రాజధానిలో జాతీయ స్థాయి గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌-2025 జరగనుంది. ఈనెల 18, 19 తేదీల్లో జరిగే సమ్మిట్‌కు నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వేదిక కానుంది.

 Hydrogen Summit: అమరావతిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌

  • 18, 19 తేదీల్లో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వేదికగా నిర్వహణ

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థల భాగస్వామ్యం

  • సమ్మిట్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెమ్మసాని, గొట్టిపాటి నీతి ఆయోగ్‌ సభ్యుడు సారస్వత్‌ కూడా హాజరు

  • దక్షిణ భారతంలో తొలిసారి నిర్వహణ... పలు అంశాలపై చర్చ

గుంటూరు/విజయవాడ (లబ్బీపేట), జూలై 15(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో జాతీయ స్థాయి గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌-2025 జరగనుంది. ఈనెల 18, 19 తేదీల్లో జరిగే సమ్మిట్‌కు నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వేదిక కానుంది. ఇందుకోసం చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమం నిర్వహణలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ, ఐఐటీ తిరుపతి, ఐఐఎ్‌సఈఆర్‌ తిరుపతి, కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటసారిగా జరుగుతున్న ఈ సమ్మిట్‌ను ఎన్‌టీపీసీ, భారత్‌ పెట్రోలియం, హైడ్రోజన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, సినర్‌జెన్‌ గ్రీన్‌ ఎనర్జీ, ఏసీఎంఈ, కేపీ, యమ్నా, ఈవీఆర్‌ఈఎన్‌ వంటి సంస్థలు స్పాన్సర్‌ చేయనున్నాయి. రెండు రోజులు జరిగే సమ్మిట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఎస్‌ఆర్‌ఎం గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(రీసెర్చ్‌) డి.నారాయణరావు తెలిపారు. సదస్సులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, నీతి ఆయోగ్‌ మెంబర్‌ డాక్టర్‌ వీకే సారస్వత్‌లతో పాటు రాష్ట్ర సీఎస్‌ విజయానంద్‌ పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇక సమ్మిట్‌లోని టెక్నికల్‌ సెషన్స్‌లో పలు సమస్యలపై చర్చించనున్నారు. సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.


అతి త్వరలో హైడ్రోజన్‌ కారు

విశాఖను గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న సదస్సుకు ఐఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వనిస్తున్నామని ఎస్‌ఆర్‌ఎం గ్రూప్‌ ఈడీ(రీసెర్చ్‌) ఆచార్య డి.నారాయణరావు చెప్పారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సహకారంతో తమ వర్సిటీలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని, హైడ్రోజన్‌ శక్తితో నడిచే కారును రూపొందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఏపీ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ ఎం.కమలాకరబాబు మాట్లాడుతూ, ఈ సదస్సుకు కార్పొరేషన్‌ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో 160 గిగావాట్ల రెన్యూవబుల్‌ ఎనర్జీ ఉత్పత్తి జరగాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎం ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సతీ్‌షకుమార్‌, సమ్మిట్‌ కన్వీనర్లు డాక్టర్‌ మారం పార్థసారథి, డాక్టర్‌ సుజిత్‌ కల్లూరి పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 06:57 AM