Minister Anitha: గంజాయి సాగు మానండి.. ఉద్యాన మొక్కలు పెంచండి
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:29 AM
గంజాయి రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ‘చైతన్యం-2025, గంజాయి సాగు రహితమే లక్ష్యం’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
గంజాయి రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం
గిరిజనులకు పండ్ల మొక్కలు పంపిణీ చేసిన మంత్రులు సంధ్యారాణి, అనిత
పాడేరు, జూలై 11(ఆంధ్రజ్యోతి): గంజాయి రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ‘చైతన్యం-2025, గంజాయి సాగు రహితమే లక్ష్యం’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గంజాయి సాగు, రవాణా చేస్తూ పట్టుబడితే 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. గంజాయి స్మగ్లర్లకు చెందిన రూ.3 కోట్లకుపైగా విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసిందని చెప్పారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గంజాయి సాగు వీడిన రైతులకు సిల్వర్ఓక్, సపోటా, మామిడి, జామ, నేరేడు, నిమ్మ, పనస, సీతాఫలం, జాఫ్రా మొక్కలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పోలీస్, వ్యవసాయ, ఉద్యాన, వైద్య, విద్యా శాఖల సమస్వయంతో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని కలెక్టర్ దినేశ్కుమార్ చెప్పారు. ఎస్పీ అమిత్బర్దార్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ‘ఈగల్’ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఎక్కడైనా గంజాయి సాగు, రవాణా జరిగితే 1972 టోల్ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం పలువురు గిరిజన రైతులకు పండ్ల మొక్కలు, రాగుల విత్తనాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మిరియాల శిరిషాదేవి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్, విజయనగరం రీజియన్ ఆర్టీసీ చైర్మన్ సియ్యారి దొన్నుదొర తదితరులు పాల్గొన్నారు.