AP Govt: జూన్కు వెలిగొండ పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:12 AM
జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.
కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం ఆదేశం
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం ఆ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి టెలీకాన్ఫరెన్సును నిర్వహించారు. మంత్రితోపాటు ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఒంగోలు డివిజన్ చీఫ్ ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు. నల్లమల సాగర్ రిజర్వాయరు నింపేందుకు వీలుగా చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్ తదితర పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థను మంత్రి ఆదేశించారు. టన్నెల్ 1, 2 లలోని పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫీడర్, తీగలేరు, తూర్పు ప్రధాన కాలువ పనులను కూడా నాణ్యతలో రాజీ పడకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫీడర్ కాలువ పనులు 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు. అత్యంత సూక్ష్మ స్థాయి విషయాలపైనా నిర్మాణ సంస్థకు నిమ్మల సూచనలు చేశారు.