Ashok Gajapathi Raju: 16నెలలు జైలుపాలైనవారూ నన్ను భయపెట్టాలని చూశారు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:11 AM
హైందవ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువలందరిపైనా ఉందని గోవా గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజు పిలుపునిచ్చారు.
ఎన్నో కేసులు పెట్టారు.. దేనికీ భయపడను
హైందవ ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాలి
ఇది అందరి బాధ్యత.. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
శ్రీకాకుళం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): హైందవ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువలందరిపైనా ఉందని గోవా గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మనాథ క్షేత్రంలో ఆయన బుధవారం జరిగిన ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వంశపారంపర్య ధర్మకర్త హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ‘దేవాలయాల ట్రస్టు బోర్డు సభ్యులు బాధ్యతగా ఎవరిపని వారు చేయాలి. ఆలయాల అభివృద్ధి కోసం పనిచేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. దేవుడికి సేవచేసే అవకాశం లభించినవారు.. దేవుని సేవలో భాగస్వాములు కావాలి’ అని అన్నారు. అంతేకాకుండా, ‘అవినీతి కేసులో 16 నెలలు జైలులో గడిపిన వారు కూడా నన్ను భయపెట్టాలని చూశారు. గత ప్రభుత్వ హయాంలో నాపై ఎన్నో కేసులు పెట్టారు. వాటికి ఏనాడూ భయపడలేదు. నేను దేనికీ భయపడను. దైవం అండగా ఉంటుంది. చట్టాలను అందరూ గౌరవించాలి’ అని వ్యాఖ్యానించారు. అనంతరం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతితో కలసి శాలిహుండం కొండపై ఉన్న బుద్ధిస్ట్ మ్యూజియంను సందర్శించారు.