కేసీ డిసి్ట్రబ్యూటరీకి గండి
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:48 PM
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొట్లూరు గ్రామ సమీపంలో గురువారం కేసీ డిసి్ట్రబ్యూటరీ పంట కాలువ కోతకు గురై గండిపడింది.
150 ఎకరాల్లో నీట మునిగిన పంటలు
ఆందోళనలో రైతులు
చాగలమర్రి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొట్లూరు గ్రామ సమీపంలో గురువారం కేసీ డిసి్ట్రబ్యూటరీ పంట కాలువ కోతకు గురై గండిపడింది. జంగాలపల్లె గ్రామ సమీపంలోని కేసీ ప్రధాన కాలువ నుంచి గొట్లూరు కేసీ కెనాల్ డిసి్ట్రబ్యూటరీ కాలువకు నీరు అధికంగా విడుదల చేయడంతో గొట్లూరు గ్రామ సమీపంలో పంట కాలువకు గండిపడి పంట పొలాల్లో నీరు ప్రవహించింది. రైతులు సాగు చేసుకున్న శనగ, మినుము, మొక్కజొన్న తదితర పంట పొలాలు నీట మునిగాయి. 150 ఎకరాల దాక పంట పొలాలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది. వరుస తుఫానతో దెబ్బతిన్న రైతులు ఇప్పుడిప్పుడే సాగు చేసిన శనగ, మొక్కజొన్న, మినుము పంటలు నెల తిరగక ముందే కేసీ నీటి ప్రవాహంతో నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందారు. కేసీ ప్రధాన కాలువ నుంచి గొట్లూరు, గోపాయపల్లె, మల్లేవేముల గ్రామాలకు నీరు ప్రవహించే పంట కాలువ లైనింగ్ దెబ్బతినడంతో లీకేజీ నీరు పంట పొలాల్లో ప్రవహించి రైతులకు నష్టం వాటిల్లుతోంది. మల్లేవేముల గ్రామ సమీపంలో పంట కాలువ లైనింగ్ కుప్పకూలిపోవడంతో నీరంతా రోడ్ల మీద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు, రైతులు అవస్థలు పడుతున్నారు. కేసీ డిసి్ట్రబ్యూటరీ కాలువకు పడిన గండికి మరమ్మతులు చేపట్టి పంట పొలాల్లో ప్రవహించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పంట కాలువ లైనింగ్ మరమ్మతులు చేపట్టాలని, పంట నష్ట పరిహారం అందించాలని కోరారు.