7 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్: సవిత
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:59 AM
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఈ నెల 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఈ నెల 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందని తెలిపారు. ఎన్నికల హామీ అమల్లో భాగంగా ఏటా రూ.125 కోట్ల భారం భరిస్తూ.. 65 వేల చేనేత కుటుంబాలకు అందిస్తున్న బహుమతిగా ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికుడికి పని కల్పించాలన్న లక్ష్యంతో నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా 1.51 లక్షల మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించిందన్నారు. చేనేతలకు థ్రిఫ్ట్ ఫండ్ కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు, ఈ ఏడాదికి రూ.5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. హ్యాండ్లూమ్ అభివృద్ధి కోసం 10 క్లస్టర్లు ఏర్పాటు చేశామని, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం పలు వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. త్వరలో సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.