Former RTA officer CLN Gandhi: డ్రైవర్ దగ్గర అలారం ఉండాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:08 AM
ప్రైవేటు బస్సు ప్రమాదాలు చాలావరకూ మానవ తప్పిదాల వల్లే తలెత్తుతున్నాయని మాజీ ఆర్టీఏ అధికారి సీఎల్ఎన్ గాంధీ అన్నారు.
ముందు తలుపు ఆటోమాటిక్గా తెరుచుకోవాలి
వెనుక మరో ఆటోమాటిక్ డోర్ ఉండాలి
అగ్నినిరోధక పదార్థాలతో బస్సు నిర్మించాలి
రవాణా శాఖ మాజీ అధికారి గాంధీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు బస్సు ప్రమాదాలు చాలావరకూ మానవ తప్పిదాల వల్లే తలెత్తుతున్నాయని మాజీ ఆర్టీఏ అధికారి సీఎల్ఎన్ గాంధీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం అదనపు కమిషనర్గా సేవలు అందించిన గాంధీ శుక్రవారం వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రమాదంపై ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. బస్సు లోపల సరైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగేది కాదన్నారు. ఏఐఎస్ 15 నియమ నిబంధనల ప్రకారం అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి డ్రైవర్ దగ్గర అలారమ్ బటన్ ఉండాలని చెప్పారు. అలాంటి ఏర్పాటు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్లు కనబడటం లేదన్నారు. బస్సు బాడీ నిర్మాణంలోనూ అగ్ని నిరోధక పదార్ధాలు వాడాలని, అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేదని వివరించారు. ముందు భాగంలోని తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకోవాలని, అద్దాలు పగలగొట్టడానికి ప్రతి కిటికీ దగ్గర ఒక హ్యామర్ ఉంచాలని చెప్పారు. అత్యవసర తలుపులు సులభంగా తెరుచుకునేలా చూడాలని అన్నారు. బస్సు లోపలి భాగంలో మంటలను అదుపు చేసే పరికరాలుంచాలని తెలిపారు. అవేవీ లేవు కనుకే ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందన్నారు. ఈ నేరంలో బస్సు యాజమాన్యం, అధికార వ్యవస్థ, అసమగ్ర చట్టం మూడూ దోషులేనని వ్యాఖ్యానించారు. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ప్రయాణికుల ప్రాణ రక్షణకు అవసరమైన సౌకర్యాలను బస్సు యాజమాన్యాలు ఏర్పాటు చేయడం లేదని చెప్పారు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి స్లీపర్ బస్సులో తగినన్ని అగ్నిమాపక యంత్రాలు అమర్చాలి. అత్యవసర ద్వారం సరైన స్థానంలో ఏర్పాటు చేయాలి. ప్రమాద సమయంలో ఆటోమేటిక్గా తెరుచుకొనే విధంగా ముందు, వెనుక భాగాల్లో రెండు ద్వారాలు ఉండాలి. వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. ధర తక్కువ కనుక ఫోమ్ బెడ్లు, కర్టెన్లు వాడుతున్నారు. అవి మంటల తీవ్రతను పెంచుతున్నాయి.
వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఫిట్నెస్, పర్మిట్ అనుమతులు అక్కడే తీసుకున్నారు. తిరిగేది హైదరాబాద్, బెంగళూరు మధ్య. ఆ బస్సును తనిఖీ చేసే అవకాశం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు లేదు. రవాణా చట్టంలో ఇదో పెద్ద లోపం.
మూడు నెలలకు ఒకసారైనా బస్సును రిజిస్టర్ చేసిన రాష్ట్రానికి తీసుకెళ్లాలని రవాణా చట్టంలో నిబంధన ఉండేది. రాజకీయ పలుకుబడితో దాన్ని తొలగించారు. ప్రైవేటు బస్సుల యజమానులతో ఆర్టీఏ అధికారులు నిరంతరం సమావేశాలు నిర్వహించి, నిబంధనలు పాటించడం మీద కచ్చితమైన మార్గనిర్దేశాలు జారీ చేయాలి. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయన్న స్పృహ కలిగించాలి. వాళ్ల వ్యాపారాలు వాళ్లు, వీళ్ల ఉద్యోగాలు వీళ్లు చేసుకొంటామంటే కర్నూలు తరహా విషాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి బస్సుకు నియమ నిబంధనల ప్రకారం చెక్ లిస్టు సిద్ధం చేయాలి. అవన్నీ ఉన్నాయని ధ్రువీకరణ అయ్యాకే బస్సు రోడ్డు ఎక్కేలా చూడాలి.