Narsaraopet: కోడెల, శివరామ్పై తప్పుడు కేసు..విజయసాయిరెడ్డి, గోపిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:07 AM
శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు కోడెల శివరామ్లపై తప్పుడు కేసు..
నరసరావుపేట లీగల్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు కోడెల శివరామ్లపై తప్పుడు కేసు పెట్టి మానసికంగా వేధించారంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వారిద్దరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ కదం నాగజ్యోతి, గంగవరం చిన్ని, పలువురు టీడీపీ కార్యకర్తలు సోమవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2019లో అప్పటి స్పీకర్ కోడెల, తనయుడు శివరామ్ తన వద్ద లంచంగా రూ.15 లక్షలు తీసుకున్నట్లుగా కేసు పెట్టాలని విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని, శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేటకు చెందిన ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు గత శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిద్దరిపై పై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని నాగజ్యోతి, మరికొందరు కార్యకర్తలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.