Fire Accident: హిస్సార్-తిరుపతి ఎక్స్ప్రెస్ బోగీ బుగ్గి
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:52 AM
తిరుపతి రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం సంభవించి రూ.కోటి ఆస్తి నష్టం జరిగింది. హిస్సార్-తిరుపతి మధ్య నడిచే వారాంతపు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు(04717)...
రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగీకీ వ్యాప్తి
తిరుపతిలో ఘటన.. రూ.కోటి ఆస్తి నష్టం
తిరుపతి(సెంట్రల్), జూలై 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం సంభవించి రూ.కోటి ఆస్తి నష్టం జరిగింది. హిస్సార్-తిరుపతి మధ్య నడిచే వారాంతపు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు(04717) సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుకుంది. ప్రయాణికులు స్టేషన్లో దిగాక సుమారు 1.40 గంటల ప్రాంతంలో రైలును యార్డుకు తరలించారు. చింతలచేను సమీపంలో రైలును పార్కింగ్ చేస్తుండగా చివరి నుంచి రెండో బోగీలో మంటలు చెలరేగాయి. గుర్తించిన రైల్వే ఉద్యోగులు వెంటనే ఉన్నతాధికారులకు తెలిపి, మంటలు చెలరేగిన బోగీ నుంచి మిగతా పెట్టెలను వేరు చేశారు. ఆ పక్కనే నిలిపిన రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ బోగీకి కూడా మంటలు వ్యాపించి, దాని పెయింట్ కాలిపోయింది. దీంతో ఆ రైలు పెట్టెలనూ అక్కడ్నుంచి తొలగించారు. అగ్నిమాపక యంత్రం వచ్చే వరకు రైల్వే సిబ్బంది ఫైర్ బాల్స్ ద్వారా మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే బోగీ పూర్తిగా కాలిపోయింది. అగ్ని ప్రమాదం పార్కింగ్ ట్రాక్లపై జరగడంతో మిగతా రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగలేదని స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, స్టేషన్ మేనేజరు కె.చినరెడ్డెప్ప తెలిపారు. అగ్ని ప్రమాదాన్ని సిబ్బంది సకాలంలో గుర్తించడంతో మిగతా బోగీలకు మంటలు వ్యాపించకుండా, పెను ప్రమాదాన్ని నివారించిన ట్లైందని చెప్పారు. ఘటనపై విచారణకు జోనల్ స్థాయి అధికారుల కమిటీ వచ్చే అవకాశం ఉంది.