వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు: ఫరూక్
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:58 AM
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన కేంద్ర పథకాల వినియోగం, హజ్-2026, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఉపాధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లిన 1618 మందికి కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హజ్ యాత్ర విజయవంతంగా ముగిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 2026 హజ్ యాత్రకు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. మైనార్టీల అభ్యున్నతి, స్వయం ఉపాధి కల్పన కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు.