రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
ABN , Publish Date - May 30 , 2025 | 11:52 PM
తన పొలంలో విత్తనాలు నాటి మోటారు సైకిల్పై తిరిగి ఇంటికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొని రైతు కురువ రామన్న(62) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇద్దరికి తీవ్రగాయాలు
మంత్రాలయం, మే 30 (ఆంధ్రజ్యోతి): తన పొలంలో విత్తనాలు నాటి మోటారు సైకిల్పై తిరిగి ఇంటికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొని రైతు కురువ రామన్న(62) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం శుక్రవారం జరిగింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెట్నహళ్లి గ్రామానికి చెందిన రామన్న తన పొలంలో విత్తనాలు నాటి, తన మనవడు ఆరేళ్ల కృష్ణకుమార్ను బైక్ వెనుకాల కూర్చుబెట్టుకుని ఇంటికి బయల్దేరాడు. మంత్రాలయం నుంచి మాధవరానికి ఇద్దరు వ్యక్తులతో వస్తున్న మరో బైక్ వీరి బైక్ను వేగంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో రామన్న అక్కడికక్కడే మృతి చెందగా.. కృష్ణకుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తిరుమల డెయిరీలో సేల్స్మెనగా పని చేస్తున్న ఆదోని ఆవన్నపేటకు చెందిన టి. పాండురంగ, రాంపురానికి చెందిన రఘు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ ఎమ్మిగనూరు ఆసుపతిక్రి తరలించారు. మంత్రాలయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిలిచిపోయిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య లక్ష్మి, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వైసీపీ మండల కన్వీనర్ గురెడ్డి భీమిరెడ్డి మృతదేహాన్ని ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించడంలో సహకరించాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.