Nellore Farmers Protest: ఉద్రిక్తతల నడుమ చలో కరేడు
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:31 AM
ఉద్రిక్తతల నడుమ మధ్య రైతు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం తలపెట్టిన ‘చలో కరేడు’ కార్యక్రమం ముగిసింది.
రైతు, ప్రజాసంఘాల నాయకుల అరెస్ట్
ఉలవపాడు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉద్రిక్తతల నడుమ మధ్య రైతు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం తలపెట్టిన ‘చలో కరేడు’ కార్యక్రమం ముగిసింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు ప్రాంతంలో ప్రభుత్వం ఇండోసోల్ సోలార్ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణ చేపడుతోందని పేర్కొంటూ.. ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కరేడు, చుట్టుపక్కల గ్రామాల్లో పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు అమల్లో ఉన్నందున 300 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఇండోసోల్ కంపెనీ కరేడు నుంచి వెళ్లిపోవాలని సోమవారం ఉదయం రైతులు, గ్రామస్థులతో కలిసి శివాలయంలో పూజలు చేసి, స్వామివారి వద్ద ఓ వినతిపత్రాన్ని ఉంచారు. పచ్చని పొలాలతో కళకళలాడుతున్న గ్రామం జోలికి రావద్దని ఉద్యమ నేతలు హెచ్చరించారు. మరోవైపు కరేడులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఎం, ప్రజాసంఘాలు, రైతు కూలీ సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం పోలీస్ స్టేషన్లకు తరలించారు. భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి ప్రభుత్వం ప్రజలను ప్రలోభాలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు.