Share News

Family Dispute: పిన్నిని నరికేసి.. 4 ముక్కలుగా చేసి..!

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:14 AM

కట్టుకున్న భర్తను, కుమారుడిని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందో మహిళ. దీనికి కారణం తన చిన్నమ్మేనని అప్పటి నుంచి రగిలిపోతున్నాడు...

Family Dispute: పిన్నిని నరికేసి.. 4 ముక్కలుగా చేసి..!

  • గోనె సంచుల్లో కట్టి కాల్వల్లో పడేసిన వైనం

  • విజయవాడలో దారుణం.. పోలీసుల అదుపులో తండ్రీకొడుకు

విజయవాడ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కట్టుకున్న భర్తను, కుమారుడిని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందో మహిళ. దీనికి కారణం తన చిన్నమ్మేనని అప్పటి నుంచి రగిలిపోతున్నాడు ఆ ఇల్లాలి భర్త. ఆ కోపాన్ని 13 ఏళ్ల తర్వాత కొడుకుతో కలిసి తీర్చుకున్నాడు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి నరికి చంపి, నాలుగు ముక్కలుగా చేసి కాల్వల్లో పడేశాడు. విజయవాడలోని భవానీపురం హెచ్‌బీ కాలనీలో దసరా ముందు రోజు ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం ఉర్మిళానగర్‌కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి(65) కుమారుడితో కలిసి జీవిస్తోంది. కోడలు చనిపోవడంతో తల్లీకొడుకులిద్దరే ఇంట్లో ఉంటున్నారు. విజయలక్ష్మి అక్క కొడుకు వంకధార హనుమాన్‌జీ సుబ్రహ్మణ్యానికి భార్య హారిక, కుమారులు శ్రీమహావిష్ణు, ఇంటర్మీడియట్‌ చదువుతున్న 16 ఏళ్ల కుమారుడు, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. భార్యభర్తల మధ్య వివాదాలు రావడంతో 2012వ సంవత్సరానికి ముందు ఆమె పెద్దకుమారుడిని, కుమార్తెనూ తీసుకుని తిరువూరు వద్ద ఉన్న కంభంపాడులోని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సుబ్రహ్మణ్యం అప్పటి నుంచి రెండో కుమారుడితో కలిసి ఉంటున్నాడు. దీనికి చిన్నమ్మే కారణమని నాటి నుంచి సుబ్రహ్మణ్యం రగిలిపోతున్నాడు. ఈనెల ఒకటో తేదీన విజయలక్ష్మి ఇంటికి వెళ్లాడు. మంచిగా మాట్లాడి ఆమెను బైకుపై హెచ్‌బీ కాలనీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. రెండో కుమారుడితో కలిసి ఇంట్లోనే పెద్ద కత్తితో మెడ నరికేశాడు. తర్వాత తండ్రీకొడుకులిద్దరూ కలిసి విజయలక్ష్మి శరీరాన్ని నాలుగు భాగాలుగా ముక్కలు చేశారు. వాటిని గోనె సంచుల్లో కుక్కి వేర్వేరు మురుగు కాల్వల్లో పడేశాడు. విజయలక్ష్మి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.

Updated Date - Oct 06 , 2025 | 03:14 AM