కందుల ధర పతనం
ABN , Publish Date - May 30 , 2025 | 11:51 PM
గత నెల 21వ తేదీ నాటికే మార్క్ఫెడ్ అధికారులు కందుల కొనుగోళ్లను నిలిపివేశారు.
మార్క్ఫెడ్ కొనుగోళ్లు నిలిపివేయడమే కారణం
గరిష్ఠ ధర కేవలం రూ.6,619 మాత్రమే
ఆందోళనలో రైతులు
కర్నూలు అగ్రికల్చర్, మే 30 (ఆంధ్రజ్యోతి): గత నెల 21వ తేదీ నాటికే మార్క్ఫెడ్ అధికారులు కందుల కొనుగోళ్లను నిలిపివేశారు. రైతులు మరోదారి లేక తమ వద్ద ఉన్న కందులను కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకువస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కందుల ధరను తగ్గించి కొంటున్నారు. కందులు నాణ్యంగా లేవని, ఈక్రాఫ్ నమోదు చేసుకోలేదనే కారణాలతో మార్క్ఫెడ్ అధికారులు కందుల కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ మాటలు అబద్ధమని, తమ వద్ద భారీగా స్థాయిలో నాణ్యమైన కందులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. శుక్రవారం కర్నూలు మార్కెట్ యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి 428 క్వింటాళ్ల కందులను అమ్మకానికి తెచ్చారు. ప్రభుత్వం కందులకు క్వింటానికి రూ.7,500 ధర ప్రకటించింది. అయితే.. కొనుగోలు కేంద్రాలు మూసివేయడంతో రైతులు కర్నూలు మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున విక్రయానికి తీసుకువస్తున్నారు. ఈ యార్డులో శుక్రవారం గరిష్ఠ ధర రూ.6,619, మధ్యస్థ ధర రూ.6,551, కనిష్ఠ ధర రూ.2,600 మాత్రమే రైతులకు దక్కింది. అదే విధంగా వేరుశనగ కాయలకు గరిష్ఠ ధర రూ.6,669, మద్యస్థ ధర రూ.3,539, కనిష్ఠ ధర రూ.2712 మాత్రమే రైతులకు అందింది. మొక్కజొన్నలకు మద్దతు ధర రూ.2,550 కాగా, కర్నూలు మార్కెట్ యార్డులో గరిష్ఠ ధర రూ.2,180, మధ్యస్థ ధర, కనిష్ఠ ధర రూ.2,150 పలికింది. శనగల ధర కేవలం రూ.3వేలుగా వ్యాపారులు నిర్ణయించారు. మిర్చి క్వింటానికి గరిష్ఠ ధర రూ.5,999 మాత్రమే దక్కింది.