Kaveri Travels Bus Driver: నకిలీ సర్టిఫికెట్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:23 AM
కర్నూలు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన వేమూరి కావేరి బస్సును నడిపిన డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య ఆర్టీయే అధికారులను మాయ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఆర్టీయేను మాయ చేసిన కావేరి డ్రైవర్ లక్ష్మయ్య
కారంపూడి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కర్నూలు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన వేమూరి కావేరి బస్సును నడిపిన డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య ఆర్టీయే అధికారులను మాయ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య.. పదో తరగతి చదివినట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించి హెవీ లైసెన్సు పొందాడు. హెవీ డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి 8వ తరగతి వరకు చదివి ఉండాలి. కానీ, లక్ష్మయ్య 5వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఇక, లక్ష్మయ్య డ్రైవింగ్ కెరీర్ కూడా ఏమీ బాగోలేదని తెలుస్తోంది. 2004లో లారీ నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ చెట్టును ఢీ కొట్టాడు. ఆ ఘటనలో లారీ క్లీనర్ మృత్యువాత పడ్డాడు. తర్వాత హైదరాబాద్లో కావేరీ ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్గా చేరాడు. హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే బస్సులకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తాజా ఘటనకు సంబంధించి పోలీసులు శనివారం లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.