IMD Forecast: ఈశాన్యంలో మిగులు వర్షాలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:34 AM
ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి.
112 శాతం వర్షపాతం నమోదయ్యే చాన్స్
ఈనెల మూడో వారంలో దక్షిణాదిలోకి రుతుపవనాలు: ఐఎండీ
విశాఖపట్నం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ ఈశాన్య రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. తమిళనాడు/పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాటకకు ఈ రుతుపవనాలు పరిమితమవుతుంటాయి. ఈ మూడు నెలల కాలంలో దీర్ఘకాల సగటులో 112 శాతం, అదే అక్టోబరు నెలలో అయితే 115 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 17 నుంచి 21వ తేదీ మధ్యన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పలు మోడళ్లు అంచనా వేస్తున్నాయి.
నేడు రాయలసీమలో భారీ వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు ఎండ తీవ్రం గా ఉండటం, మరోవైపు సముద్రం నుం చి తేమగాలులు వీయడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని సోమవారం రాష్ట్రంలో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. కాగా, చిత్తూరు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.