తప్ప తాగి.. తన్నులాట
ABN , Publish Date - May 20 , 2025 | 12:54 AM
ముగ్గురు స్నేహితులు పీకల దాకా తాగారు. కారులో బయటకు వచ్చారు. నడిరోడ్డుపై కనిపించిన వాళ్లందరితో కయ్యానికి కాలు దువ్వారు. ఎదురుతిరిగిన వారిపై దాడి చేశారు. యనమలకుదురుకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి సృష్టించిన వీరంగం ఇది.
-ముగ్గురు స్నేహితుల అరాచకం
-విజయవాడలో పలువురిపై దాడి
-అపస్మారకస్థితిలో డెలివరీ బాయ్
విజయవాడ, మే 19(ఆంధ్రజ్యోతి) : ముగ్గురు స్నేహితులు పీకల దాకా తాగారు. కారులో బయటకు వచ్చారు. నడిరోడ్డుపై కనిపించిన వాళ్లందరితో కయ్యానికి కాలు దువ్వారు. ఎదురుతిరిగిన వారిపై దాడి చేశారు. యనమలకుదురుకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి సృష్టించిన వీరంగం ఇది. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన రోహిత దస్తావేజు లేఖరి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. దీక్షిత కొరియర్ సర్వీసులో ఉద్యోగి. చందు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఈ ముగ్గురు స్నేహితులు ఆదివారం సాయంత్రం భారతీనగర్లో ఉన్న నెట్ క్రికెట్కు వెళ్లారు. అక్కడ ఆడుకున్న తర్వాత వారితోపాటు ఉన్న అజయ్ అనే స్నేహితుడి పుట్టినరోజు వేడుకను బార్లో జరుపుకున్నారు. మొత్తం అంతా కలిసి మైకం తెలియకుండా తాగారు. తర్వాత కారులో రహదారులపై వీరంగం చేశారు. భారతీనగర్లో డెలివరీ ఇచ్చి వెళ్లిపోతున్న బ్లింకిట్ ఉద్యోగి కె.రాజశేఖర్రెడ్డిని పిలిచి గొడవ పడ్డారు. ద్విచక్ర వాహనం తాళాలు ఇవ్వాలని అసభ్యకరంగా దూషించారు. ఇది చూసిన అదే సంస్థలోని ఏజెంట్ నాగిపోగు రమేష్ అక్కడికి వెళ్లాడు. అతడినీ బూతులు తిట్టారు. గొడవ జరుగుతుండడం బ్లింకిట్ సంస్థ అధికారులకు తెలియజేయడానికి రాజశేఖర్రెడ్డి వెళ్లాడు. కార్యాలయం నుంచి ఉద్యోగులు వచ్చే సరికి రమేష్ తలను నేలకేసి కొట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో ఉన్న రమేష్ను తోటి ఉద్యోగులు అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అతడు ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఇక్కడి నుంచి కారులో వెళ్లిపోయిన ముగ్గురూ పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డులో ఆటోడ్రైవర్ను ఆపి దాడి చేశారు. ఈ ఘటనలపై పటమట, మాచవరం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురు నిందితులను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.