Share News

మేల్కొని ఉన్నా.. దక్కని ప్రాణం

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:55 AM

ఆయన కూర్చున్నది ఏసీ బోగీలో. రైలు ఎక్కినప్పటి నుంచి కొంతదూరం వరకు బోగీలో వాతావరణం చల్లగానే ఉంది. లోపల ఉన్న వాళ్లలో కొంతమంది చలికి దుప్పటి ముసుగేసుకుని నిద్రలోకి జారుకున్నారు. ఆయన మాత్రం ‘ఆర్థిక’ భద్రత కోసం కంటిరెప్ప వాల్చలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బోగీలో వెచ్చదనం మొదలైంది. ఆ వెచ్చదనమే మంటగా మారి మసి చేస్తుందని ఊహించలేదు. అగ్నికీలలు అల్లుకునే సరికి తేరుకున్నా జీవితం తెల్లారిపోయింది. మంటల్లోనే సజీవ దహనం అయిపోయాడు. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్‌ సుందరం(70) ఎదుర్కొన్న పరిస్థితి ఇది.

మేల్కొని ఉన్నా.. దక్కని ప్రాణం

-యలమంచిలి రైలు ప్రమాదంలో దారుణం

- మంటల్లో వస్త్ర వ్యాపారి సజీవ దహనం

- ఆనవాలు చెప్పిన చెవి రింగ్‌

- నున్నలోని ఇంటికి మృతదేహం

ఆయన కూర్చున్నది ఏసీ బోగీలో. రైలు ఎక్కినప్పటి నుంచి కొంతదూరం వరకు బోగీలో వాతావరణం చల్లగానే ఉంది. లోపల ఉన్న వాళ్లలో కొంతమంది చలికి దుప్పటి ముసుగేసుకుని నిద్రలోకి జారుకున్నారు. ఆయన మాత్రం ‘ఆర్థిక’ భద్రత కోసం కంటిరెప్ప వాల్చలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బోగీలో వెచ్చదనం మొదలైంది. ఆ వెచ్చదనమే మంటగా మారి మసి చేస్తుందని ఊహించలేదు. అగ్నికీలలు అల్లుకునే సరికి తేరుకున్నా జీవితం తెల్లారిపోయింది. మంటల్లోనే సజీవ దహనం అయిపోయాడు. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్‌ సుందరం(70) ఎదుర్కొన్న పరిస్థితి ఇది.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ): విజయవాడ రూరల్‌ మండలం నున్న మామిడి మార్కెట్‌ ఎదురుగా ఉండే వెలగపూడి హోమ్స్‌ అపార్టుమెంట్‌లోని రెండో అంతస్తులో చంద్రశేఖర్‌ సుందరం ఉంటున్నారు. తమిళనాడు రాషా్ట్రనికి చెందిన ఆయన కొన్నేళ్ల క్రితం విజయవాడకు వచ్చి కుటుంబంతో స్థిరపడ్డారు. వన్‌టౌన్‌లోని కృష్ణవేణి క్లాత మార్కెట్‌లో హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు.

భార్యతో మాట్లాడుతుండగానే..

‘‘వనిత... రైలు ఎక్కాను. యలమంచిలి స్టేషన్‌కు వస్తుంది. ఇప్పటి వరకు చలి వేసింది. ఎందుకో ఇప్పుడు వేడిగా అనిపిస్తోంది. నాకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తోంది’’. చంద్రశేఖర్‌ సుందరం చివరి మాటలు ఇవి. ఆయన ఆదివారం రాత్రి వైజాగ్‌లో టాటా - ఎర్నాకులం ఎక్సైప్రెస్‌లో బీ12 బోగీ ఎక్కారు. 12వ నంబరు బెర్త్‌ కింద బ్యాగ్‌ను భద్రపరుచుకున్నారు. రైలు దిగే వరకు ఆ బ్యాగ్‌ను కనిపెట్టుకుని ఉండడం కోసం కంటి మీదకు కునుకు రానివ్వలేదు. బెర్త్‌పై నుడుం వాల్చి విజయవాడలో ఉన్న భార్య వనితకు ఫోన్‌ చేశారు. రైలు ఎక్కానని, కొంతమంది నిద్రపోతున్నారని, తనకు ఇప్పటి వరకు చలి వేసినప్పటికీ ఎందుకో ఒక్కసారిగా వెచ్చదనం తగులుతోందని చెప్పారు. అప్పటికే బోగీ కింద నుంచి మంటలు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు.

నగదు వసూలు చేసుకుని వస్తూ..

వస్త్రవ్యాపారం చేసే చంద్రశేఖర్‌ వైజాగ్‌లో వ్యాపారులకు ఇచ్చిన సరుకుకు సంబంధించిన డబ్బులను వసూలు చేసుకోవడానికి అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ వ్యాపారుల నుంచి రూ.5లక్షలను వసూలు చేసి, ఆ బ్యాగ్‌ను బెర్త్‌ కింద ఒక మూలకు పెట్టుకున్నారు. భార్యతో మాట్లాడుతుండగానే ఫోన్‌ ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పటికే మంటలు బోగీని చుట్టిముట్టేశాయని అనుమానిస్తున్నారు. వాస్తవానికి బోగీకి రెండు వైపుల నాలుగు ద్వారాలు ఉంటాయి. ఇందులో రెండు ద్వారాలను మంటలు మూసివేయడంతో మిగిలిన రెండు ద్వారాల గుండా ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కింది దూకేశారు. స్టేషన్‌కు దగ్గరకు రావడంతో రైలు వేగాన్ని లోకో పైలెట్‌ తగ్గించారు. బోగీలో ఉన్న వాళ్లంతా బ్యాగ్‌లతో హడావుడిగా దిగారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలయ్యాయి. బెర్త్‌ కింద మూలన పెట్టుకున్న నగదు బ్యాగ్‌ను తీసుకుంటుండగా మంటలు చంద్రశేఖర్‌ను చుట్టేశాయి. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆయన మృతదేహం చెవికి ఉన్న రింగ్‌ను బట్టి చంద్రశేఖర్‌ సుందరంగా నిర్ధారించారు. యలమంచిలి నుంచి ఆయన మృతదేహం సోమవారం రాత్రి ఇంటికి చేరుకుంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కృతిక సుందరం పుష్ప హోటల్‌ సెంటర్‌లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. చిన్నకుమార్తె చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. చంద్రశేఖర్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Dec 30 , 2025 | 01:06 AM