ACB Investigation: ఇదేం.. ఎం మాయ
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:26 AM
ఆయన అడిగినంత చేతిలో పెడితే సరేసరి.. లేకపోతే కీలకమైన ‘ఎంబుక్’లో అంకెలు మార్చేస్తారు. కొలతలకు కోతలు వేస్తారు. రికార్డులను మార్పించేస్తారు. ఇదీ.. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) సబ్బవరపు శ్రీనివాసరావు వ్యవహారం.
గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ అరాచకాలు
ఏసీబీ దాడికి ముందు ఎంబుక్లో మార్పులు
అధికారులను పిలిచి తప్పు చేయించిన ఈఎన్సీ
లంచం ఇవ్వని కాంట్రాక్టర్లే లక్ష్యంగా మార్పులు
25 మంది ఇంజనీరింగ్ అధికారులకు నోటీసులు
నేడు విచారించనున్న ఏసీబీ
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
ఆయన అడిగినంత చేతిలో పెడితే సరేసరి.. లేకపోతే కీలకమైన ‘ఎంబుక్’లో అంకెలు మార్చేస్తారు. కొలతలకు కోతలు వేస్తారు. రికార్డులను మార్పించేస్తారు. ఇదీ.. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) సబ్బవరపు శ్రీనివాసరావు వ్యవహారం. ఈఎన్సీ సీట్లో కూర్చుని ఆయన చేసిన అరాచకాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. ఏసీబీకి చిక్కడానికి 2 నెలల ముందు శ్రీనివాసరావు రికార్డులను మార్చేసినట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన ఎంబుక్లో భారీగా మార్పులు చేసినట్టు తెలిసింది. ప్రధానంగా తాను డిమాండ్ చేసిన మొత్తం ముట్టజెప్పని కాంట్రాక్టర్లకు సంబంధించిన ఎంబుక్లో బలవంతంగా మార్పులు చేశారని సమాచారం. ఈ మార్పులు చేసిన ఈఈ, డీఈ, ఏఈలను ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ఇంజనీరింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
మాయలు ఇలా..
ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఇంజనీరింగ్ విభాగంలో ఎంబుక్ చాలా కీలకం. ఒక కాంట్రాక్టర్ చేసిన పనులకు ఇదే ప్రామాణికం. ఎంబుక్ సక్రమంగా ఉంటేనే బిల్లులు చేస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఈఎన్సీగా వ్యవహరించిన శ్రీనివాసరావు సరిగ్గా ఈ ఎంబుక్లను టార్గెట్ చేసుకుని కాంట్రాక్టర్లను పీడించారని తెలుస్తోంది. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లకు అధికారులు ‘వర్క్ ఆర్డర్’ ఇస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడతారు. భూమి పూజ జరిగినప్పటి నుంచి దశల వారీగా జరిగే పనుల వివరాలను కాంట్రాక్టర్లు ఎంబుక్లో నమోదు చేయించుకోవాలి. ఎంబుక్లో నమోదు చేసిన కొలతలు, వివరాల ప్రకారం పనులు పూర్తయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంజనీరింగ్ అధికారులు వాటిపై సంతకాలు చేస్తారు. ఈఎన్సీ శ్రీనివాసరావు ఆగస్టు 8న ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా రూ.25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఈ ఘటన జరగడానికి 2 నెలల ముందు కాంట్రాక్టర్ను దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన ఎంబుక్లను పూర్తిగా మార్చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ కాంట్రాక్టర్ ఎక్కడ పనులు చేశారో ఆ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ అధికారులను శ్రీనివాసరావు విజయవాడకు పిలిపించుకుని, వారితో ఎంబుక్ల్లో రాసిన కొలతలు, వివరాలను మార్పించినట్టు తెలిసింది.
కీలక విషయాలపై దర్యాప్తు
శ్రీనివాసరావు గత చరిత్రను అధ్యయనం చేసిన ఏసీబీ అధికారులు కీలక విషయాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఎంబుక్ల వ్యవహారం కనిపించింది. ఈ కాంట్రాక్టర్నే కాకుండా ఇంకా మరికొంతమంది కాంట్రాక్టర్లను ఎంబుక్ల ద్వారా శ్రీనివాసరావు దారికి తెచ్చుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో మార్పులు చేసిన సదరు ఇంజనీరింగ్ అధికారులను ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు.