Central Govt: ఉన్నతి మరోసారి పొడిగింపు
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:43 AM
ఉపాధి హామీ పథకంలో పనిచేసే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఉన్నతి పథకాన్ని వచ్చే మార్చి వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
2026 మార్చి వరకూ కొనసాగించాలని నిర్ణయం
సవరణ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో పనిచేసే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఉన్నతి పథకాన్ని వచ్చే మార్చి వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.పథకాన్ని 2026 మార్చి 31 వరకు కొనసాగిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పథకం మార్గదర్శకాలను సవరించింది. ఉన్నతి పథకం కింద దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన(డీడీయూ-జీకేవై), రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఆర్ఎస్ఈటీఐ), నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్(ఎన్ఆర్ఎల్ఎం), పీఎం విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, కృషి విజ్ఞాన్ కేంద్రం, రాష్ట్ర స్కిల్లింగ్ ప్రోగ్రాంల ద్వారా 18-45 ఏళ్ల యువతకు శిక్షణ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఉపాధి శ్రామికులకు శిక్షణ అందించారు. తాజా సవరణల ప్రకారం 2018-19 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉపాధి పనులకు హాజరైన వారిని, ఒక్కో కుటుంబంలో ఇద్దరిని శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణకు ఎంపికయ్యే ఉపాధి శ్రామికులకు 100 రోజుల పనిదినాలు కల్పిస్తారు. హాజరైన అన్ని రోజులకు ఉపాధి వేతనాన్ని స్టైపెండ్ రూపంలో కేంద్రం చెల్లిస్తుంది.