Ashok Gajapathi Raju: మాన్సాస్ పూర్వ వైభవానికి కృషి
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:52 AM
విజయనగరం మాన్సాస్ విద్యా సంస్థల పూర్వవైభవానికి కృషి చేస్తామని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రూ12.75 కోట్ల ట్రస్టు నిధులతో...
గత ప్రభుత్వం ఈ విద్యా సంస్థలను ఇబ్బందులకు గురిచేసింది
రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలనూ ధిక్కరించింది
మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
విజయనగరం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): విజయనగరం మాన్సాస్ విద్యా సంస్థల పూర్వవైభవానికి కృషి చేస్తామని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రూ12.75 కోట్ల ట్రస్టు నిధులతో పునర్నిర్మించిన విజయనగరం కోటలోని మాన్సాస్ విద్యాసంస్థలకు చెందిన మోతీ మహల్, అదనపు తరగతి గదులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా వ్యాప్తి కోసమే తమ పూర్వీకులు మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) సంస్థను స్థాపించారని, ఆ లక్ష్యంతోనే నేటికీ ముందుకు సాగుతోందని చెప్పారు. కానీ, ఐదేళ్ల క్రితం అధికారం వెలగబెట్టిన అప్పటి ప్రభుత్వం మాన్సాస్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో పలు ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత, ప్రభుత్వ పాఠశాలల అసంబద్ధ విలీనంతో 14లక్షల మంది విద్యార్థులను విద్యకు దూరం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను కూడా ధిక్కరించిందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, విజయనగరం కోట భవిష్యత్ తరాల అభివృద్ధికి దోహదపడుతుందంటూ.. మోతీ మహల్ భవన పునఃనిర్మాణానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.