విద్యా అవస్థ!
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:17 AM
జిల్లాలో విద్యాశాఖ తీరు నేల విడిచి సాము చేస్తున్నట్టుగా తయారైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో బడిఈడు పిల్లల ఆధారంగా మోడల్ ప్రైమరీ పాఠశాలల మ్యాపింగ్ చేసిన అధికారులు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లను నియమించారు. పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉండాలని నిబంధన పెట్టడం, 30 మంది కూడా ఉండకపోవడం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పిల్లల సంఖ్య పెంచాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పుడు వారిని ఎక్కడ నుంచి తేవాలంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈలోపు శిక్షణ తరగతలు పెట్టడంతో పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన ఇంకా ఆరంభంకాలేదని విమర్శలు వస్తున్నాయి.
- కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాలల విధానం అమలు
- మ్యాపింగ్ ఆధారంగా 1-5 తరగతులకు ఐదుగురు టీచర్ల నియామకం
- 60 మంది విద్యార్థులు ఉండాలని నిబంధన
- కొన్ని పాఠశాలల్లో 30 కూడా దాటని సంఖ్య
- విద్యార్థుల సంఖ్య పెంచాలని ఇప్పుడు టీచర్లపై ఒత్తిడి
- పాఠశాలలు తెరిచి నెల దాటడంతో ఎక్కడ దొరుకుతారని ఆందోళన
జిల్లాలో విద్యాశాఖ తీరు నేల విడిచి సాము చేస్తున్నట్టుగా తయారైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో బడిఈడు పిల్లల ఆధారంగా మోడల్ ప్రైమరీ పాఠశాలల మ్యాపింగ్ చేసిన అధికారులు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లను నియమించారు. పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉండాలని నిబంధన పెట్టడం, 30 మంది కూడా ఉండకపోవడం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పిల్లల సంఖ్య పెంచాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పుడు వారిని ఎక్కడ నుంచి తేవాలంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈలోపు శిక్షణ తరగతలు పెట్టడంతో పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన ఇంకా ఆరంభంకాలేదని విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
నూతన విద్యా విధానంలో పాఠశాలలను క్రమబద్ధీకరించేందుకు ఈ ఏడాది విద్యాశాఖలో పలు మార్పులు చేశారు. దీనికి ముందు ఆయా గ్రామాల్లో బడిఈడు పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకుని కొన్ని పాఠశాలలను మ్యాపింగ్ చేశారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు 60 మంది పిల్లలు ఉండేలా మోడల్ ప్రైమరీ పాఠశాలలను మ్యాపింగ్ చేశారు. ఈ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు, తరగతికి ఒక టీచర్ ఉండేలా ఐదుగురు టీచర్లను విద్యాశాఖ అధికారులు ఇటీవల జరిగిన బదిలీల్లో అక్కడకు పంపారు. కానీ బడిఈడు పిల్లలందరూ మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేరలేదు. దీంతో ఈ తరహాలోని కొన్ని పాఠశాలల్లో 30 మందిలోపే ఉన్నారు. తరగతికి ఒక టీచర్ ఉన్నారు కాబట్టి, 60 మంది పిల్లలు ఈ మోడల్ పాఠశాలల్లో ఉండేలా చూడాలనే నిబంధన పెట్టారు. మోడల్ స్కూల్కు సమీపంలో ఉన్న గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను మోడల్ పాఠశాలల్లోకి తీసుకురావాలని ఎంఈవోలు, క్లస్టర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఏడాది మోడల్ పాఠశాలల్లో 60 మంది విద్యార్థుల సంఖ్యను చూపకుంటే, వచ్చే ఏడాది ఉపాఽధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని మిగులుబాటుగా ఉన్న టీచర్లను దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు బదిలీ చేయడం ఖాయమని విద్యాశాఖ అధికారులు చెప్పకనే చెబుతున్నారు. టీచర్లు మోడల్ ప్రాథమిక పాఠశాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను తమ పాఠశాలకు పంపాలను అడుగుతున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ప్రస్తుతం చదువుతున్న పాఠశాలలోనే ఉంటారని, దూరప్రాంతంలోని పాఠశాలల్లో చేర్చబోమని తెగేసి చెబుతున్నారు. దీంతో మోడల్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ అన్న చందంగా మారింది. మరోవైపు స్థానికంగా ఉన్న సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే ఉంటారని, ఇక్కడి వారిని వేరే పాఠశాలకు పంపితే, వచ్చే ఏడాది తమ గ్రామంలోని పాఠశాలను వేర్వేరు కారణాలు చూపి రద్దు చేస్తారని, ఈ తలనొప్పులు మాకెందుకని ఖరాఖండిగా చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేనిస్థితిలో ఉన్న వారిని గుర్తించి, వారి గృహాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించాలని టీచర్లు కోరుతుంటే.. ఇప్పుడా అడిగేది, ఈ సంవత్సరానికి వదిలేయండి, వచ్చే సంవత్సరం చూద్దామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
పాఠాలు చెప్పిందేలేదు!
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులపైనే అయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు శిక్షణ కార్యక్రమాల పేరుతో ప్రత్యేక షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తొలి విడతగా, ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు రెండో విడతగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు సమగ్రశిక్ష ద్వారా స్కూల్ లీడర్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లకు పాఠ్యాంశాల బోధనలో మెళకువలను నేర్పిస్తున్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలను బడిలో చేర్పించే పనితో పాటు, శిక్షణ కార్యకమాలకు హాజరవుతుండటం, ఎంఈవోలు, క్లస్టర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్వహించే సమావేశాలకు వెళ్లడంతో ఇంతవరకు పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభమే కాలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్లపై ఒత్తిడి తగ్గించి వచ్చే ఏడాది నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ముందస్తుగానే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.