Liquor Commission Scandal: ఆ ఐదేళ్లూ బాదుడే
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:50 AM
రాష్ట్రంలో మద్యం ధరలు దిగివచ్చాయి. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలంటే విచ్చలవిడి దోపిడీకి కేరా్ఫగా మారగా.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మద్యం ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడమేకాకుండా..
కమీషన్ల కిక్కుతో మద్యం ధరలకు రెక్కలు
జగన్ హయాంలో 6,300 కోట్ల భారం
చీప్ నుంచి స్కాచ్ వరకూ ధరాభారం
సీసాపై రూ.20-200 వరకు అదనం
కమీషన్ల రూపంలో తాడేపల్లికి చేరిక
ప్రస్తుతం కమీషన్ రాజ్కు గుడ్బై
నెలకు 116 కోట్ల భారం నుంచి విముక్తి
దేశంలోనే తొలిసారి కీలక నిర్ణయం
రాష్ట్రంలో మద్యం ధరలకు ముకుతాడు పడింది. సీఎం చంద్రబాబు చర్యలతో దాదాపు 20కి పైగా ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు దిగివచ్చాయి. దీంతో ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.200 దాకా తగ్గింది. ఫలితంగా నెలకు రూ.116 కోట్ల వరకు మద్యం ప్రియులపై బాదుడు భారం లేకుండా పోయింది. ఎప్పుడూ ధరలు పెంచాలని అడిగే మద్యం కంపెనీలు ఇలా ధరలు తగ్గించుకోవడం వెనుక.. వారు గత జగన్ ప్రభుత్వంలో మాదిరిగా ప్రస్తుత సర్కారు పెద్దలకు ఎలాంటి ముడుపులు ఇవ్వాల్సిన అవసరం లేకపోవడమే.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో మద్యం ధరలు దిగివచ్చాయి. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలంటే విచ్చలవిడి దోపిడీకి కేరా్ఫగా మారగా.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మద్యం ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడమేకాకుండా.. 20కిపైగా ప్రీమియం మద్యం బాటిళ్ల ధరలు తగ్గేలా చేసింది. వాస్తవానికి సాధారణంగా నాలుగైదేళ్లకు ఒకసారి మద్యం బ్రాండ్ల కంపెనీలు ధరలు పెంచాలని ప్రభుత్వాలను కోరుతుంటాయి. దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ధరలు పెంచుతాయి. కానీ, దేశంలో తొలిసారి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక కంపెనీలు దాదాపు 20కిపైగా మద్యం బ్రాండ్ల ధరలు తగ్గించాయి. కంపెనీలు ధరలు తగ్గించడంతో వాటికి అనుగుణంగా ప్రభుత్వం పన్నులు కూడా తగ్గించింది. ఫలితంగా ఆయా బ్రాండ్ల ధరలు దిగి వచ్చాయి. ఉదాహరణకు మాన్షన్ హౌస్ క్వార్టర్ సీసా రూ.220 నుంచి రూ.190కి తగ్గకా, రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్పై రూ.20 తగ్గింది. యాంటిక్విటీ బ్లూ ఫుల్ బాటిల్ ధర ఏకంగా రూ.200 తగ్గింది. ఇలా అనేక మద్యం బ్రాండ్ల ధరలు దిగివచ్చాయి. అలాగే జాతీయ స్థాయి కంపెనీలు క్వార్టర్ రూ.99 ధరతో మద్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరిగాయి. కానీ, ఇదేసమయంలో సర్కారుకు ఆదాయం తగ్గింది.
జగన్ కమీషన్ల వ్యాపారం
వైసీపీ హయాంలో భారీగా ధరలు పెంచేసి వినియోగదారులను దోపిడీ చేశారు. వాస్తవంగా అమ్మకాలతో సమానంగా రాబడి పెరగాలి. కానీ, జగన్ ప్రభుత్వంలో కమీషన్ల కోసం అవసరం లేకపోయినా ధరలు పెంచడంతో వినియోగదారుల జేబుకు భారీగా చిల్లు పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ధరలు తగ్గిపోవడంతో ఆ వ్యత్యాసం స్పష్టమైంది. ధరలు తగ్గడంతో వినియోగదారులపై నెలకు రూ.116 కోట్ల భారం తగ్గింది. గత ప్రభుత్వంలో దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ఈ అదనపు దోపిడీ కొనసాగింది. నెలకు రూ.116 కోట్ల చొప్పున వైసీపీ హయాంలో రూ.6,300 కోట్ల వరకు అదనంగా దోపిడీ చేశారు. జగన్ హయాంలో ఐదేళ్ల కాలంలో రూ.99 వేల కోట్ల విలువైన మద్యం అమ్మితే, దానిలో రూ.6 వేల కోట్లకు పైగా వినియోగదారులు అదనంగా చెల్లించారు. అలా చెల్లించిన దాని నుంచే వైసీపీ పెద్దలకు కమీషన్లు వెళ్లాయి.
పక్కా ప్లాన్తో ధరలు పెంపు
రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తామని, దీనిలో భాగంగా షాక్ కొట్టేలా మద్యం రేట్లు పెంచుతామని అధికారంలోకి రాకముందు జగన్ 2018-19 మధ్య అనేక సార్లు ప్రకటించారు. అన్నట్టుగానే మద్యం ధరలు ఆకాశాన్ని తాకేలా పెంచారు. దాని అసలు ఉద్దేశం తాగుడు తగ్గించడమే అయితే మంచిదే. కానీ, అలా ధరలు పెంచగా వచ్చిన అదనపు ఆదాయాన్ని కమీషన్ల రూపంలో పక్కదారి పట్టించారు. పైగా ధరలు పెంచడం అంటే ప్రభుత్వం పన్నులు పెంచితే సరిపోతుంది. ఇలా చేస్తే తద్వారా వచ్చే రాబడి ఖజానాకు చేరుతుంది. కానీ, పన్నులతో పాటు కంపెనీలకు ఇచ్చే ధరలను కూడా వైసీపీ ప్రభుత్వం పెంచింది. ఉదాహరణకు ఒక పాపులర్ బ్రాండ్ ఒక కేసును తెలంగాణలో రూ.1,100కు సరఫరా చేస్తే, అదే కేసును ఏపీలో రూ.1,600కు సరఫరా చేసింది. ఇలా అదనంగా చెల్లించిన మొత్తం కమీషన్ల రూపంలో వైసీపీ శిబిరానికి చేరింది.
‘జే’ బ్రాండ్లకు చెల్లు
అప్పటికే మార్కెట్లో ఉన్న బ్రాండ్ల నుంచి కమీషన్లు వసూలు చేయడం ఒకెత్తు అయితే కొత్తగా ‘జే’ బ్రాండ్లను తీసుకొచ్చి నచ్చిన రేట్లకు అమ్ముకోవడం మరొక ఎత్తుగా జగన్ జమానాలో సాగింది. వైసీపీ ప్రభుత్వంలో 68.2శాతం బ్రాండ్లు ఊరుపేరు లేనివే. టాప్ బ్రాండ్లను కేవలం 11 శాతమే అమ్మారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయ, జాతీయ కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. అనామక బ్రాండ్ల అమ్మకాలు 7.2శాతానికి పడిపోయాయి. ప్రభుత్వం పాపులర్ బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘జే’ బ్రాండ్లు వాటంతట అవే క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
తేడా.. చూడు!
2024-25 మొదటి మూడు మాసాల్లో 82.76 లక్షల కేసుల లిక్కర్, 28.19 లక్షల కేసుల బీరు అమ్మారు. వీటి విలువ రూ.7,086 కోట్లు.
2025-26 మొదటి త్రైమాసికంలో 1.02 కోట్ల కేసుల లిక్కర్, 64.64 లక్షల కేసుల బీరు విక్రయించారు. వీటి విలువ రూ.7,889 కోట్లు.
2024-25 మొదటి 3 మాసాల వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే 2025-26 కూటమి ప్రభుత్వ తొలి 3 మాసాల్లో లిక్కర్ 24 శాతం, బీరు 129 శాతం అమ్మకాలు పెరిగాయి.
విలువపరంగా పెరిగింది 11.33 శాతం. అంటే రూ.800 కోట్లు. ఈ సొమ్ము ఇప్పుడు ఖజానాకు చేరితే.. గతంలో దీనిపై వైసీపీ పెద్దలకు కమీషన్లు చేరాయి.
‘అదనం’ రికవరీ చేయరా?
గత ప్రభుత్వంలో కమీషన్ల కోసం పెంచుకున్న ధరలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలకు తగ్గాయి. వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలకు అదనంగా చెల్లించిన మొత్తాలను దొడ్డిదారిలో వైసీపీ పెద్దలకు కమీషన్ల రూపంలో సమర్పించుకున్నాయి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కమీషన్లు మాయమయ్యాయి. అయినా ఆరు నెలల పాటు అదనపు చెల్లింపులు కంపెనీలకు కొనసాగాయి. అలా అదనంగా చెల్లించింది దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. దానిని కంపెనీల నుంచి రికవరీ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.