Prakasam District: నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్తో ‘టోల్’కు నామం
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:21 AM
టోల్ప్లాజాల వద్ద ఫీజు చెల్లించకుండా తప్పించుకొనేందుకు.. ఎమ్మెల్యే స్టిక్కర్ను మార్ఫింగ్ చేసి కారును బాడుగలకు తిప్పుతున్న...
ప్రకాశంలో ఓ కారు డ్రైవర్ అరెస్టు
ఎర్రగొండపాలెం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): టోల్ప్లాజాల వద్ద ఫీజు చెల్లించకుండా తప్పించుకొనేందుకు.. ఎమ్మెల్యే స్టిక్కర్ను మార్ఫింగ్ చేసి కారును బాడుగలకు తిప్పుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు స్టిక్కర్తో కారు (ఏపీ 07డీ జడ్ 1807)లో యథేచ్ఛగా తిరుగుతున్న అతడికి చెక్ పెట్టారు. వినుకొండ ఎమ్మెల్యే పేరుతో తిరుగుతున్న కారు డ్రైవర్ షేక్ మున్వర్ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మిల్లంపల్లి టోల్ప్లాజా వద్ద గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అజయ్కుమార్ తెలిపారు. ఎస్ఐ చౌడయ్య తమ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ వాహనంపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదని గుర్తించారు. ఈ క్రమంలో డ్రైవర్ మున్వర్ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారని తెలిపారు. మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ మున్వర్ గతంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వద్ద డ్రైవర్గా పనిచేశాడు. ఆ సమయంలో కాలం చెల్లిన ఎమ్మెల్యే స్టిక్కర్ను సేకరించి, ప్రస్తుతం దానిపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేరును మార్ఫింగ్ చేసి టోల్ప్లాజాల వద్ద ఫీజు చెల్లించకుండా అద్దెకు నడుపుతున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.