AP Govt: డీడీఓ వ్యవస్థ బలోపేతం
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:32 AM
జిల్లాల్లో పాలనను బలోపేతం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే పంచాయతీరాజ్ వ్యవస్థలకు మరిన్ని అధికారాలు, బాధ్యతలను అప్పగిస్తూ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
డివిజన్ స్థాయిలో ఒకే గొడుగు కిందకు పీఆర్, ఆర్డీ
సంక్షేమ శాఖల డివిజన్ స్థాయి కార్యాలయాలూ డీడీఓ పరిధిలోకి
డీఎల్పీఓ, డ్వామా ఏపీడీ కార్యాలయాలూ అదే ఆవరణలోకి
కీలక నిర్ణయాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో పాలనను బలోపేతం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే పంచాయతీరాజ్ వ్యవస్థలకు మరిన్ని అధికారాలు, బాధ్యతలను అప్పగిస్తూ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ సంస్కరణల్లో భాగంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీడీఓ)లకు కీలకమైన అధికారాలు కట్టబెట్టింది. ఆ మేరకు డీడీఓల జాబ్చార్ట్ను మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే పరిపాలన నియంత్రణలోకి తీసుకురావాలని నిర్ణయించింది. డివిజన్ స్థాయిలో ఉన్న డివిజనల్ పంచాయతీ ఆఫీసు(డీఎల్పీఓ), డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్(ఏపీడీ), ఇతర శాఖల డివిజనల్ కార్యాలయాలనూ డీడీఓ కార్యాలయాల సముదాయంలోకి మార్చాలని నిర్ణయం తీసుకుంది. సమగ్రమైన జాబ్చార్ట్ రూపొందిస్తూ పాత జాబ్చార్ట్కు సవరణలు చేశారు. ఆ మేరకు జీఓ నెం. 58ను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
డీడీఓల విధులివే..
డివిజన్ స్థాయిలో అన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలను డీడీఓ నియంత్రిస్తారు. డివిజన్ స్థాయిలో అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ సమీక్షలు నిర్వహిస్తారు. పాలనాపరంగా ప్రతి నెలా కనీసం 20 రోజులు పర్యటించి టూర్ డైరీలను కలెక్టర్లకు సమర్పించాలి. ఎంపీడీఓలతో పాటు డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బంది మొత్తం డీడీఓ నియంత్రణలో పనిచేస్తారు. ప్రతి ఆర్నెల్లకోసారి మండలపరిషత్ కార్యాలయాలను డీడీఓ తనిఖీ చేస్తారు. అభివృద్ధి పనుల్లో తేడాలుంటే జిల్లా యంత్రాంగానికి నివేదిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి వరకు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా ఆర్డీఓలుగా ఉండేవారు. ఇక నుంచి డీడీఓలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ రూల్స్ను సవరించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న డీడీఓ కార్యాలయాల ఆవరణలోనే డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీల కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం మరో ఉత్తర్వును గురువారం జారీచేసింది. ఇతర శాఖల కార్యాలయాలూ ఈ ఆవరణలోనే ఏర్పాటు చేయనున్నారు.