వెహికల్ డిపోలో డీజిల్ దొంగలు!
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:16 AM
కార్పొరేషన్ వెహికల్ డిపోలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. మూలనపెట్టిన వాహనాల సంగతి బయటకు రానీయకుండా, వాటికి డీజిల్ వినియోగించినట్టుగా లెక్కలు చూపి దోచుకున్న నగదు గుట్టును సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టింది. వాహన డిపో కేంద్రంగా 2017లో జరిగిన అక్రమాలపై తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఇంటి దొంగలు అందినకాడికి కార్పొరేషన్ సొమ్మును అడ్డగోలుగా తినేశారన్నది వాస్తవమని స్పష్టమైంది. వెహికల్ డిపోలో నిర్వహిస్తున్న వాహనాలకు ఎలాంటి ఖాతాలు నిర్వహించటం లేదని, పనిచేయని వాహనాలు, స్ర్కాప్ చేసిన వాహనాలకు కూడా ఆయిల్ వినియోగించినట్టుగా లక్షలాది రూపాయలను మింగేసిన ఐదుగురు ఇంజనీరింగ్ అధికారులపై చర్యలకు ఆదేశించింది. వినియోగించని, స్ర్కాప్కు పంపిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లను ఇతర పనులకు ఉపయోగించారన్న ఆరోపణలు కూడా విజిలెన్స్ నివేదికలో వెల్లడయ్యాయి.
వెహికల్ డిపోలో డీజిల్ దొంగలు!
- ఉపయోగించని, స్ర్కాప్ శానిటేషన్ వాహనాలలో డీజిల్ నింపారట!
- దొంగ రికార్డులతో అడ్డంగా దొరికిన నాటి ఇంజనీరింగ్ అధికారులు
- నిగ్గుతేల్చిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
- ఐదుగురు ఇంజనీరింగ్ అధికారులపై చర్యలకు ఆదేశం
కార్పొరేషన్ వెహికల్ డిపోలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. మూలనపెట్టిన వాహనాల సంగతి బయటకు రానీయకుండా, వాటికి డీజిల్ వినియోగించినట్టుగా లెక్కలు చూపి దోచుకున్న నగదు గుట్టును సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టింది. వాహన డిపో కేంద్రంగా 2017లో జరిగిన అక్రమాలపై తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఇంటి దొంగలు అందినకాడికి కార్పొరేషన్ సొమ్మును అడ్డగోలుగా తినేశారన్నది వాస్తవమని స్పష్టమైంది. వెహికల్ డిపోలో నిర్వహిస్తున్న వాహనాలకు ఎలాంటి ఖాతాలు నిర్వహించటం లేదని, పనిచేయని వాహనాలు, స్ర్కాప్ చేసిన వాహనాలకు కూడా ఆయిల్ వినియోగించినట్టుగా లక్షలాది రూపాయలను మింగేసిన ఐదుగురు ఇంజనీరింగ్ అధికారులపై చర్యలకు ఆదేశించింది. వినియోగించని, స్ర్కాప్కు పంపిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లను ఇతర పనులకు ఉపయోగించారన్న ఆరోపణలు కూడా విజిలెన్స్ నివేదికలో వెల్లడయ్యాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కార్పొరేషన్ వెహికల్ డిపోలో మొత్తం 152 వాహనాలు ఉన్నాయి. వీటిలో 105 వాహనాలు రన్నింగ్లో ఉన్నాయి. మరో 10 వాహనాలు రన్నింగ్లో లేవు. మరో 37 వాహనాలను స్ర్కాప్ చేయటం జరిగింది. రన్నింగ్లో ఉన్న 105 వాహనాలలో 64 వాహనాలు వెహికల్ డిపో నియంత్రణలో ఉన్నాయి. ఈ వాహనాలను నడపటానికి 210 మంది డ్రైవర్లు, క్లీనర్ల సేవలను అప్పట్లో ఉపయోగించారు. వాహన డిపోకు అప్పట్లో వర్క్స్ డివిజన్ - 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) వెహికల్ డిపోకు కూడా ఇన్చార్జిగా ఉన్నారు. ఒక డిప్యూటీ ఇంజనీర్, ఒక అసిస్టెంట్ ఇంజనీర్ సహాయకులుగా ఉన్నారు. వెహికల్ డిపోలో నిర్వహిస్తున్న వాహనాలకు అధికారికంగా ఎలాంటి ఖాతాలు నిర్వహించకుండా ఆయిల్ దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలు వచ్చాయి. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ‘లెక్కేలేదు’ అనే శీర్షికతో వెహికల్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి వెహికల్ డిపోలో విచారణ చేపట్టింది. 2015 - 2017 మధ్య కాలంలో వెహికల్ డిపోలో జరిగిన వ్యవహారాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించి విచారణ పూర్తి చేసింది.
కమిషనర్కు తాజాగా విచారణ రిపోర్టు
అప్పటి విచారణకు సంబంధించి తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి, విజయవాడ మునిసిపల్ కమిషనర్కు తాజాగా రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు మేరకు చూస్తే.. 2015 - 2017 మధ్య కాలంలో రికార్డుల పరిశీలన మేరకు వెలుగు చూసిన అంశాలను వెహికల్ డిపోలోని మెకానిక్లు, శానిటేషన్ వాహనాలకు ఆయిల్ కూపన్లు జారీ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్లు, వెహికల్ డిపోలోని ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బందిని విచారించారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా విచారించారు. వెహికల్ డిపోకు స్పేర్ పార్టులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లను కూడా అధికారులు విచారించారు. ఈ క్రమంలో వాహనాల ఖాతాల నిర్వహణకు సంబంధించి జరిగిన చీకటి వ్యవహారాలను విజిలెన్స్ బయట పెట్టింది.
రూ.3.60 లక్షల ఆయిల్ గోల్మాల్!
కార్పొరేషన్ తన వాహనాలకు ఆయిల్ అవసరాల కోసం వెహికల్ డిపోలో ఒక డీజిల్ ఆయిల్ పంపును నిర్వహిస్తోంది. ఈ పంప్ వాహన డిపో ఇన్చార్జి అయిన ఈఈ నియంత్రణలో ఉంటుంది. హెల్త్ విభాగం నుంచి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ .. కార్పొరేషన్ శానిటేషన్ వాహనాలకు ఆయిల్ కూపన్లను జారీ చేస్తాడు. వీటిని ఈఈ సూచనల మేరకు మెకానికల్ విభాగం ద్వారా అందుబాటులో ఉంచుతారు. ఆయిల్ పంపు ఇన్చార్జి ఆయిల్ను తీసుకుని.. ఆయిల్ వినియోగ రిజిస్టర్లో వివిధ వాహనాలకు ఎంత ఇండెంట్ కేటాయించిందో వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ రికార్డులను పరిశీలించగా, వినియోగించని (ఆఫ్ రోడ్)వాహనాలు, స్ర్కాప్కు పంపిన వాహనాలు (కండెమ్డ్)కు కూడా ఆయిల్ను నింపినట్టుగా నమోదు చేసినట్టుగా గుర్తించారు. ఏపీ 16 టీడీ 1518 , ఏపీ 16 టీ బీ 5051, ఏపీ 16 టీబీ 1708, ఎపీ 16 టీఈ 1722 వాహనాలకు మొత్తం 5,633 లీటర్ల డీజిల్ను నింపినట్టుగా రికార్డులలో నమోదు చేసినట్టుగా గుర్తించారు. వాస్తవానికి ఈ వాహనాలు డీజిల్ను నింపినట్టుగా నమోదు చేసిన తేదీలు, సంవత్సరాల కంటే కూడా ముందే అవి ఆఫ్రోడ్, కండెమ్డ్గా ఉన్నాయని విజిలెన్స్ నిగ్గుతేల్చింది. ఈ చర్యల ద్వారా రూ.3.60 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టుగా విజిలెన్స్ గుర్తించింది. శానిటరీ ఇన్స్పెక్టర్ జి.కృష్ణదేవరాయలను విచారించగా.. తాను ఆయిల్ టోకెన్లు జారీ చేసిన విషయాన్ని అంగీకరించారని కూడా తెలిపింది.