Bapatla: నేడు బాపట్లకు డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:53 AM
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ గురువారం బాపట్ల పరిధిలోని సూర్యలంకలో పర్యటించనున్నారు.
అటవీ అమరవీరుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం
బాపట్ల, సెప్టెంబరు 10 (ఆంద్రజ్యోతి): జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ గురువారం బాపట్ల పరిధిలోని సూర్యలంకలో పర్యటించనున్నారు. విధి నిర్వహణలో భాగంగా అసువులు బాసిన అటవీ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా సూర్యలంక రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో స్థూపం ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 మంది అటవీ అమర వీరుల కుటుంబాలతో పవన్ ఆత్మీయంగా సమావేశం కావడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాళపత్ర గ్రంథం మొక్కలను డిప్యూటీ సీఎం సూర్యలంక తీర ప్రాంతం లో నాటనున్నారు. ఇవి తాటి మొక్కలలోనే అరుదైన రకంగా ఖ్యాతి గడించాయి. తీర ప్రాంతంలో మొక్కలతో గ్రీన్వాల్ ఏర్పాటయ్యేలా చూసే విధంగా ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన కోసం సూర్యలంక తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ బుధవారం పరిశీలించారు.