Deputy CM Pawan: పర్యాటకుల భద్రతకో పాలసీ
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:44 AM
రాష్ట్రంలో పర్యాటకుల భద్రతకు ఒక పాలసీ తేవాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పర్యాటకం సురక్షితమనే నమ్మకం కలిగించాలి: డిప్యూటీ సీఎం
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటకుల భద్రతకు ఒక పాలసీ తేవాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం అటవీ, పర్యాటక, దేవదాయ, రోడ్లు-భవనాల శాఖ సమన్వయ సమావేశం నిర్వహించారు. ‘పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక ప్రవర్తనా నియమావళి అమలు చేయాలి. రాష్ట్రంలో పర్యాటకం సురక్షితమనే భావం పర్యాటకుల్లో కలగాలి. టూరిజం హాట్ స్పాట్లలో హెలీ పోర్టులు అభివృద్ధి చేయాలి. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు 100శాతం భరోసా ఇవ్వాలి. పర్యాటకులకు కూడా ప్రవర్తనా నియమావళిని తీసుకొచ్చి, నిక్కచ్చిగా అమలు చేయాలి. మన్యంలో ప్రకృతి దృశ్యాలను వారసత్వ సంపదగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో హెలీ టూరిజం అభివృద్ధి చేయాలి. అన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయాలి. అంతరించిపోతున్న కళలకు పునరుజ్జీవం పోసేలా ఆర్కిటెక్చర్ ఉండాలి. మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం వంటి కొండ ప్రాంతాల్లో పర్వతారోహణకు అనుకూల పరిస్థితులు కల్పించాలి. కవుల గొప్పతనం భావి తరాలకు తెలిసేలా గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, మొల్లమాంబ తదితరుల ఇళ్లను పరిరక్షించి, సాహితీ సర్క్యూట్గా ఏర్పాటు చేయాలి’ అని పవన్ సూచించారు.