Share News

Deputy CM Pawan Kalyan: మోదీ నాయకత్వంలో ఆర్థిక వృద్ధి బలోపేతం

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:27 AM

భారత ఆర్థిక వ్యవస్థ గత 11 ఏళ్లుగా మరింత బలోపేతమైందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Deputy CM Pawan Kalyan: మోదీ నాయకత్వంలో ఆర్థిక వృద్ధి బలోపేతం

ఎన్డీయేకు, ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుంది: పవన్‌

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): భారత ఆర్థిక వ్యవస్థ గత 11 ఏళ్లుగా మరింత బలోపేతమైందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎంఎ్‌సఎంఈ, ఫార్మా, ఐటీతో పాటు వ్యవసాయ రంగాల్లో దేశం మంచి ప్రగతి సాధించిందన్నారు. ప్రపంచదేశాలకు భారత్‌ పోటీగా నిలిచిందని చెప్పారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా దేశ ప్రజలు, వ్యాపారాలు, రైతులతో పాటు జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి ఎన్డీయే ప్రభుత్వం స్థిరంగా వ్యవహరించిందన్నారు. ఇండో-యూఎస్‌ వాణిజ్య చర్యల సందర్భంలో కూడా దేశ ఆర్థిక ప్రాధాన్యతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం దృఢంగా నిలిచిందన్నారు. దేశ సుదీర్ఘ ప్రయోజనాల కోసం ఇలాంటి కీలకమైన సమయంలో, ప్రతి పౌరుడు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం చాలా ముఖ్యమన్నారు. దురదృష్టవశాత్తు కొంత మంది ప్రతిపక్ష నాయకులు భారత ఆర్థిక వ్యవస్థపై నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారని, ఇవి దేశ ఖ్యాతిని దెబ్బతీసే విధంగా, అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. భారతదేశ గౌరవాన్ని ఫణంగా పెట్టి, రాజకీయలాభం కోసం ఇటువంటి ప్రకటనలు చేయడం బాధ్యతారహితమన్నారు. ఇది నూతన భారతం అని, ఇకపై తలవంచుకునే దేశం కాదని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. దేశ ఆర్థిక పురోగతిలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య భాగస్వామ్యాలను పెంచుకోవడంతో పాటు ఒక దేశంపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించిందన్నారు. దేశం ఆర్థిక బలోపేతం కావడానికి, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఎన్డీయే ప్రభుత్వానికి, ప్రధాని మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ తరఫున తాను పూర్తి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 05:27 AM