Peddapuram: వ్యభిచార గృహాలను నిర్మూలించాలి
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:35 AM
కాకినాడ జిల్లా పెద్దాపురంలో వ్యభిచార గృహాలను సమూలంగా నిర్మూలించాలని, తమ మనోభావాలు దెబ్బతినేలా అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య బలిజ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు
అసత్య ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెద్దాపురంలో సూర్యబలిజ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
పెద్దాపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురంలో వ్యభిచార గృహాలను సమూలంగా నిర్మూలించాలని, తమ మనోభావాలు దెబ్బతినేలా అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య బలిజ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి గూడూరి మోహన్రావు ఆధ్వర్యంలో పెద్దాపురం మున్సిపల్ జంక్షన్ వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం వదిలేసిన వృత్తిని ప్రస్తావిస్తూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో తమను కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సమాజంలో తమ కులస్థులు ఎంతో ఉన్నతమైన జీవితాలను గడుపుతున్నారని, అయినా తమ పేరు ప్రస్తావించి మనోభావాలు దెబ్బతినేలా కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇటువంటి అసత్య ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం సీఐ విజయ్శంకర్కు వినతిపత్రాన్ని అందచేశారు.