AP Govt: సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపు
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:55 AM
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రెండు డీఏ బకాయిలను చెల్లించింది.
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రెండు డీఏ బకాయిలను చెల్లించింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను జూలై 2018 డీఏ బకాయిలు, 30 నెలలు, జనవరి 2019 బకాయిలు 30 నెలలు మొత్తం రెండు డీఏల 60 నెలల బకాయిలు సుమారు రూ.3.50 కోట్లకు పైగా సోమవారం చెల్లించింది. దీంతో సచివాలయ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో ఉద్యోగికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు జమ అయినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. డీఏ బకాయిల విడుదలపై సచివాలయ సంఘం మాజీ కార్యదర్శి జి రామకృష్ణ, రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట్ల రాజేశ్, నాపా ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలోని అందరికీ చెల్లించాలి
రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులందరికీ డీఏ బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని ఏపీసీపీఎ్సఈఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సతీష్, సీఎందాస్ సోమవారం కోరారు. రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలుగా సీఎ్ఫఎంఎ్సలో గ్రీన్ చానల్లో ఉన్న 60 నెలల బకాయిలు చెల్లించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సీపీఎస్ ఉద్యోగులందరికీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.