IMD Warning: ముంచుకొస్తున్న మొంథా
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:34 AM
రాష్ట్రానికి మొంథా తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది.
కోస్తాకు తీవ్ర తుఫాన్ ముప్పు
రేపటి నుంచి 29 వరకూ రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం
28 నాటికి తీవ్ర తుఫాన్గా బలపడుతుందని అంచనా
ఆ రాత్రికి కాకినాడ-తుని మధ్య తీరం దాటే అవకాశం
పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు
28 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు: ఐఎండీ
ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక
ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదు
ప్రభావిత జిల్లాలకు ఇన్చార్జిలను నియమించాలి
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని
కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు
పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
విశాఖపట్నం/అమరావతి/కాకినాడ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం పడమర దిశగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. శనివారం సాయంత్రానికి చెన్నైకి 890 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 920 కి.మీ., కాకినాడకు 920 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం ఉదయానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత మరింత బలపడి సోమవారం ఉదయానికి తుఫాన్గా బలపడుతుంది. దీనికి థాయ్లాండ్ దేశం సూచించిన ‘మొంథా’ అని పేరు పెట్టనున్నారు. ఇది 28 సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద (ఒక అంచనా మేరకు కాకినాడ-తుని మధ్య) తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో 28న ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి.
తుఫాన్ తీరం దాటే సమయంలో గాలులు 90 నుంచి 110 కి.మీ. వేగంతో వీస్తాయి. తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 27 నుంచి 29 వరకూ పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 29 వరకు కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. శనివారం విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
బీచ్లకు పర్యాటకుల ప్రవేశంపై నిషేధం
ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, సోమవారం నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడిగా మారి, అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున సముద్ర తీరాలు, నదుల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలను నిలుపుదల చేసి, బీచ్లకు పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
కాకినాడ పోర్టు అప్రమత్తం
తుఫాన్ ముప్పు ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. అదనపు కరెంటు స్తంభాలు, సిబ్బంది, జనరేటర్లను సిద్ధం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్లో సమీక్షించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కాకినాడ పోర్టుల్లో అన్ని కార్గో ఎగుమతి, దిగుమతులు నిలిపివేయనున్నారు. ఇక్కడ లంగరు వేసిన ఓడలను సోమవారం మధ్యాహ్నం నుంచి సముద్రంలోకి తరలించనున్నారు.
అప్రమత్తంగా ఉండండి: సీఎం
‘మొంథా’ ముప్పు నేపథ్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని, తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే సన్నాహాక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్చార్జి అధికారులను నియమించి, నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లు సహా ఇతర అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. భారీవర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకుని, సహాయ కార్యక్రమాలకు 11 జిల్లాలకు ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. విపత్తు సహాయ కార్యక్రమాలకు తక్షణ ఖర్చులు భరించడానికి ఈ నిధులు తీసుకోవటానికి జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
విపత్తు సహాయం పంపిణీ: మంత్రి నాదెండ్ల
శనివారం సాయంత్రం పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని తీరప్రాంత జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ పాయింట్లలో నెలవారీ కేటాయింపుల కంటే ఎక్కువగా స్టాక్ ఉంచాలని ఆదేశించారు. తుఫాను షెల్టర్లు, సహాయక శిబిరాల్లో ఆహారాన్ని తయారు చేయడానికి ఎంఎల్ఎస్ పాయింట్లలో అందుబాటులో ఉన్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాల్లో ఇప్పటికే కోసిన వరి ధాన్యాన్ని సమీపంలోని రైస్ మిల్లులకు తరలించేందుకు వ్యవసాయాధికారులతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
తుఫాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం
అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్నమయ్య, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో సోమ, మంగళవారాలు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సోమవారం నుంచి బుధవారం వరకు మూడురోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కోనసీమ జిల్లాలో తుఫాను హెచ్చరికలకు అనుగుణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు.