Crop Damage: రైతు కంట కన్నీరు
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:22 AM
తుఫాను ప్రభావంతో అనేక జిల్లాల్లో పంట నీటిపాలైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 3600 ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది.
పంటలను ముంచిన తుఫాను
ఇంటర్నెట్ డెస్క్: తుఫాను ప్రభావంతో అనేక జిల్లాల్లో పంట నీటిపాలైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 3600 ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. ఏలూరు జిల్లాలో 1506.71 హెక్టార్లలో వరి, మినుము పంట చేలు నేలకొరగటంతోపాటు ముంపునకు గురయ్యాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలంలో సుమారు 200 ఎకరాల్లో వరి పంట నీటి మునిగినట్టు అంచనా వేశారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో బొప్పాయి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, బాపట్ల జిల్లాలోని కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, చుండూరు, అమృతలూరు మండలాల్లో అక్కడక్కడ వరి చాపలా నేలపై పరుచుకుపోయింది. అరటి, తమలపాకు, బొప్పాయి తోటలు నేలవాలాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 350 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని.. ఇంకా మరింత పెరిగే అవకాశముందని ప్రాథమిక సమాచారం అందింది. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, మామిడి, జీడిమామిడి, అరటి మొక్కలు నేలకొరిగిపోయాయి.